మువ్వన్నెల జెండా సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటన
తరతరాలుగా మట్టిపొరకింద పడి ఉన్న విత్తనానికి తడి వాసన తగులుతున్నది. మొలకెత్తి మహా వృక్షంగా ఎదగాలన్న ఎడతెగని ఆశకు జీవధార తోడుకానున్నది. అణచివేత అవరోధాలను ఛేదించి సమాజ ప్రగతికి దళిత జాతి పాదుకలు తొడుగుతున్నది. ప్రభుత్వ విప్లవాత్మక కృషిని అనంత విజయంగా మార్చే సంకల్పానికి నేడు తొలి అడుగు పడుతున్నది. రాష్ట్రంలోని దళితజాతి ఉద్ధరణే లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ వేదికగా సోమవారం లాంఛనంగా ప్రారంభిం చనున్నారు.
ఆకురాలే సీకెటెపుడు
ఆవరించి ఉండదు..
వేకువ మొగ్గలు తొడిగి
వెలుగు నవ్వులనొంపురా
కంచెలురిమి చూసె వేళ
కోయిల పాటాగినా
మంచికాలం వసంతమందున
గొంతునెత్తి పాడదా
కదిలె సుడులకు జడిసి సేప ఈతనాపుకొంటదా..
కటిక సీకటికదిరి మిణుగురు వెలుగు పంచనంటదా
పేద జనుల వెనుకబాటు కాదు నీకు శాపము
మన పాలిట మన కేసీఆరే దారి చూపే దీపము
దేహంలో కొంతభాగాన్ని ఖండిస్తే అది కుప్పకూలుతుంది. అలాగే దేశంలో ఒక పెద్ద ప్రజా సమూహాన్ని అణచివేస్తే ఆ దేశం కూడా కుప్పకూలుతుందనే నిజాన్ని గ్రహించాలి. ప్రజాస్వామ్యమంటే సమానత్వమే.
‘వీలైనంత త్వరగా దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపాలి. దళితుల అభివృద్ధి అందుకు మొదటి సోపానం కావాలి’ అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లోని గంభీర్యాన్ని దేశ పరిపాలనా వ్యవస్థలన్నీ ఇప్పటికైనా గ్రహించాలి.
ప్రభుత్వ పథకాల పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తితో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది. ఆశించిన గమ్యం, లక్ష్యం చేరుకోవాలంటే వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఉండాలి. ఈ మూడింటి మేళవింపుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజాభ్యుదయ పథంలో ముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నా.
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం జారీచేసే కాంట్రాక్టులు, లైసెన్సుల్లో దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. ప్రభుత్వం దళితులకు ఆర్థిక ప్రేరణ కల్పించడం వరకే పరిమితం కావడం లేదని, వారిని వివిధ వ్యాపార రంగాల్లో ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిందని చెప్పారు. ఎరువుల దుకాణాల ఏర్పాటు, మెడికల్ షాపులు, దవాఖానలు, హాస్టళ్లకు సరుకుల సరఫరా కాంట్రాక్టుల్లో, బార్, వైన్ షాపుల లైసెన్సుల మంజూరు, ఇతర కాంట్రాక్ట్ పనుల్లో దళితులకు రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఆదివారం 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
భవిష్యత్తు నిర్మాణానికి పునరంకితమవుదాం
రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత స్వాతంత్య్ర అమృత ఉత్సవాలు జరుగుతున్న ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, అమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి స్మరించుకుంటున్నది. దేశ విముక్తికి ప్రాణాలర్పించిన మహానీయులందరికీ వినమ్రంగా నివాళులర్పిస్తున్నాను. ఈ సందర్భంగా 75 ఏండ్ల స్వతంత్ర భారత ప్రస్థానంలోని వెలుగు నీడలను మనందరం వివేచించుకోవాలి. ఒకవైపున దేశం అనేక రంగాల్లో కొంతమేరకు పురోగతి సాధించింది. అదే సమయంలో చాలా రాష్ర్టాల్లో ప్రజలు కనీస అవసరాలకోసం కొట్టుమిట్టాడుతున్న దుస్థితీ ఉన్నది. ‘స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి, సంబరపడగానే సరిపోదోయి. సాధించినదానికి సంతృప్తిని చెంది, అదే విజయమనుకుంటే పొరపాటోయి’ అన్న మహాకవి శ్రీశ్రీ పాటను మనం అన్వయించుకోవలసిన అవసరం ఉన్నది. మరింత నిబద్ధత, నిజాయతీ, సామరస్యం, సమభావం నిండిన దృక్పథంతో దేశ భవిష్యత్తు నిర్మాణానికి పునరంకితం కావాలని కోరుకుంటున్నాను.
హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్
దళితబంధు పథకం అమలుకు ఈ ఏడాది బడ్జెట్లోనే నిధులు కేటాయించిన ప్రభుత్వం.. ఇటీవలే నిధులను మంజూరు చేసింది. సోమవారం నుంచి ఈ పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నది. మిగతా నియోజకవర్గాల్లో పాక్షికంగా అమలు చేస్తుంది. గత ప్రభుత్వాలు దళితులకు అందించిన చిన్నచిన్న రుణాలు, సబ్సిడీల వంటి అరకొర సహాయాలతో వారి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అందుకే దళితబంధు కింద యూనిట్ పెట్టుకోవడానికి కుటుంబానికి రూ.10 లక్షలతో ఆర్థిక ప్రేరణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వం నేరుగా జమచేస్తుంది. తిరిగి చెల్లించే భారం లేకుండా రూ.10 లక్షలను పూర్తిగా గ్రాంటు రూపంలో అందజేస్తుంది. దీంతో లబ్ధిదారుడికి వాయిదాలు చెల్లించాలనే ఆందోళన ఉండదు. ప్రశాంతంగా జీవనోపాధి కొనసాగించవచ్చు. తనకు ఏ రంగంలో అనుకూలత, అనుభవం, ప్రావీణ్యం ఉందని లబ్ధిదారుడు భావిస్తాడో ఆ రంగంలోనే జీవనోపాధిని ఎంచుకోవటానికి ప్రభుత్వం సహకరిస్తుంది. లబ్ధిదారులెవరైనా సొంతంగా ఉపాధిని ఎంచుకోవటంలో ప్రభుత్వ సూచనలు కోరితే వారికి మార్గదర్శనం చేస్తుంది. కొందరు లబ్ధిదారులు ఒక సమూహంగా ఏర్పడి పెట్టుబడిని పెంచుకొని పెద్ద యూనిట్ను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నది.
దళిత జాతిని అణిచివేస్తే దేశానికే ప్రమాదం
మనదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితులు దుర్భర పేదరికంలో మగ్గుతున్నారనేది నగ్న సత్యం. దీనికి మన రాష్ట్రం కూడా అతీతం కాదు. దళితజాతిని దారిద్య్రం ఒక్కటే కాదు.. సామాజిక వివక్ష కూడా తరతరాలుగా బాధిస్తున్నది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా దళితుల జీవితాల్లో ఇంకా చీకటే ఉన్నదనే కఠోర వాస్తవాన్ని అందరం అంగీకరించి తీరాలి. దేహంలో కొంతభాగాన్ని ఖండించితే అది కుప్పకూలుతుంది. అలాగే దేశంలో ఒక పెద్ద ప్రజా సమూహాన్ని అణచివేస్తే ఆ దేశం కూడా కుప్పకూలుతుందనే నిజాన్ని గ్రహించాలి. ప్రజాస్వామ్యమంటే సమానవత్వమే. ‘వీలైనంత త్వరగా దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపాలి. దళితుల అభివృద్ధి అందుకు మొదటి సోపానం కావాలి’ అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లోని గంభీర్యాన్ని దేశ పరిపాలనా వ్యవస్థలన్నీ ఇప్పటికైనా గ్రహించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అణగారిన కులాల వికాసం దిశగా ప్రభుత్వం బలమైన అడుగులువేసింది. దళితుల్లో విద్యా వికాసం తేవాలన్న సంకల్పంతో పెద్దఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్ళను స్థాపించింది. 2014లో దళిత విద్యార్థుల కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్ స్కూళ్లు 134 మాత్రమే. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడేండ్లలో కొత్తగా 104 స్కూళ్లు ఏర్పాటు చేసింది. ఈ రోజు వాటి సంఖ్య 238కి పెరిగింది. ఈ ఏడేండ్లలో ఎస్సీ మహిళల కోసం 30 డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం నెలకొల్పింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ప్రగతి నిధి నిధులు పూర్తిగా ఖర్చు కాకపోతే వాటిని వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
దేశానికి దారి చూపుతుంది..
రాబోయే రోజుల్లో దళితబంధు పథకం దేశానికి దారి చూపుతుంది. దేశంలో దళితుల జీవనగతిని మార్చివేసే ఉజ్వలమైన పథకంగా చరిత్రకెక్కుతుందనే సంపూర్ణ విశ్వాసం ఉన్నది. దళితులు ఇకముందు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలనే దళితబంధు లక్ష్యాన్ని ప్రభుత్వం నూటికి నూరుపాళ్ళు నెరవేరుస్తుందని హామీ ఇస్తున్నాను. తెలంగాణ దళిత బంధును ఒక పథకంగా మాత్రమే కాకుండా, ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తున్నది. ప్రభుత్వ నిబద్ధతను ఎంతోమంది దళిత మేధావులు, దళిత సంఘాల నాయకులు అభినందిస్తున్నారు. రాజ్యాంగం ప్రవచించిన సమానత్వ విలువల సాధనలో తెలంగాణ దళితబంధు ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం నూతన ప్రమాణాలను నెలకొల్పుతున్నది. దళితబంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం భవిష్యత్తులో ఏదైనా ఆపదకు గురైతే ఆ కుటుంబం పరిస్థితి మళ్లీ తలకిందులైపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఆపద సమయంలో దళితబంధు పథకం ఆ దళిత కుటుంబాన్ని ఒక రక్షక కవచంగా కాపాడాలని ప్రభుత్వం ఆలోచించింది. ఇందుకోసం దేశంలోనే ప్రప్రథమంగా దళిత రక్షణనిధిని ఏర్పాటు చేసింది. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల్లో రూ.10 వేలు లబ్ధిదారుని వాటా కింద జమచేసి, మరో రూ.10 వేలు ప్రభుత్వం కలిపి దళిత రక్షణ నిధిని నిల్వ చేస్తుంది. దళిత కుటుంబాల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా దళిత రక్షణ నిధి నుంచి ఆర్థిక సాయం చేస్తుంది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుచేసే దళితబంధు సమితులు ఈ నిధిని నిర్వహిస్తాయి. దళితబంధు ద్వారా పొందుతున్న ఫలితాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం పటిష్ట విధానం రూపొందించింది. లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇస్తుంది. అందులో ప్రత్యేక చిప్ అమర్చి, దాని సహాయంతో ఫలితాలను పర్యవేక్షిస్తుంది. దళితబంధు పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ఇతర పథకాలన్నీ గతంలో మాదిరిగానే అందుతాయి. రేషన్ కార్డు ద్వారా బియ్యం, పింఛన్లు, ఇతర సౌకర్యాలు అన్నీ యథాతథంగా కొనసాగుతాయి.
రెండో విడుత రుణమాఫీ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మూడు లక్షల మంది రైతులకు రూ.25 వేలలోపు గల పంట రుణాలను ఇప్పటికే మాఫీ చేసింది. సోమవారం నుంచి రాష్ట్రంలోని ఆరు లక్షల మంది అన్నదాతలకు రూ.50 వేల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నది. మిగిలినవారికి కూడా దశలవారీగా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తాం. తరాల తరబడి భూ వివాదాలకు దారితీస్తున్న పరిస్థితులను మార్చడానికి మూడేండ్లు కష్టపడి ధరణి పోర్టల్ను ఆవిష్కరించి పారదర్శకతను తెచ్చింది. దీనివల్ల రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమి ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతున్నది. అన్నదాతలు ఇకపై నిశ్చింతగా ఉండొచ్చు.
కొత్త జిల్లాలు, పంచాయతీలు
పరిపాలనలో అనవసర జాప్యాన్ని నివారించేందు కు, సమగ్ర అభివృద్ధికోసం రాష్ర్టాన్ని 33 జిల్లాలుగా పునర్విభజన చేసింది. రెవెన్యూ డివిజన్లను 43 నుంచి 74కి, మండలాలను 459 నుంచి 594కు, మున్సిపాలిటీను 68 నుంచి 129కి పెంచింది. కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటుచేసింది. తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చింది. గతంలో 2 పోలీస్ కమిషనరేట్లు ఉండగా, కొత్తగా 7 కమిషనరేట్లను ఏర్పాటుచేసింది. పరిశుభ్రతలోనే పరమాత్ముడు కొలువై ఉంటాడన్న మహాత్ముడి సూక్తిని నిజం చేస్తూ పల్లెలను, పట్టణాలను పరిశుభ్రంగా, పచ్చదనం ఉట్టిపడేలా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రణాళికలు అద్భుత ఫలితాలిచ్చాయి. కుల వృత్తులపై ఆధారపడినవారిని వృద్ధిలోకి తేవాలన్న సం కల్పంతో ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టింది.
15 లక్షల మందికి ఉపాధి..
పారిశ్రామిక ప్రగతిలో రాష్ట్రం నేడు దేశంలో ముందు వరసలో ఉన్నది. టీఎస్ఐపాస్ ప్రవేశపెట్టిన నాటినుంచి రాష్ర్టానికి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 16,671 పరిశ్రమలు తరలివచ్చాయి. వీటిద్వారా 15,86,500 ఉద్యోగాల కల్పన జరిగింది. రాష్ట్రంలో ఐటీరంగం అప్రతిహతంగా దూసుకుపోతున్నది. ప్రపంచ ఐటీ దిగ్గజాలైన 20 ప్రతిష్ఠాత్మక సంస్థలు హైదరాబాద్కు తరలివచ్చాయి. 2013-14లో రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ రూ.57,258 కోట్లు. 2020-21లో అది రూ.1,45,522 కోట్లకు చేరింది. గతేడాది భారత ఐటీ పరిశ్రమలో కొత్తగా వచ్చిన ప్రతి పది ఉద్యోగాల్లో మూడు తెలంగాణ ఐటీ రంగం కల్పించినవే. ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీకి సన్నాహాలు ప్రారంభించింది. నూతన జోనల్ విధానం ప్రకారం జిల్లాలకు పోస్టులు, ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయిన వెంటనే ఖాళీల భర్తీ ప్రారంభిస్తుంది.
ట్రీ సిటీగా హైదరాబాద్..
తెలంగాణకు హరితహారం ఫలితంగా ట్రీ సిటీగా హైదరాబాద్కు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. ప్రపంచంలోని 63 దేశాల్లో సర్వే చేస్తే భారత్ నుంచి ఈ ఘనత దక్కించుకున్న ఏకైక నగరం హైదరాబాదే. తెలంగాణలో పచ్చదనం సుమారు 4% పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడయింది. హరిత లక్ష్యం సిద్ధించేవరకూ అందరూ పట్టుబట్టి మొక్కలను నాటాలి. శ్రద్ధగా పెంచాలి. అన్ని ప్రాంతాల ప్రజలు సౌకర్యంగా జీవనం గడపటానికి అనువైనదిగా హైదరాబాద్కు పేరుంది. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో అడుగడుగునా నిర్మించిన ఫ్లైవోవర్లు ట్రాఫిక్ కష్టాలను తగ్గించాయి. ఇంకా పలు ఫ్లైవోవర్లు నిర్మాణదశలో ఉన్నాయి. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఆసియాలోనే రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా రికార్డు సృష్టించింది. హైదరాబాద్ అనంతంగా పెరుగుతున్నందున ఔటర్ రింగ్ రోడ్డుకు అదనంగా రీజినల్ రింగ్రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
రామప్ప, యాదాద్రి మన సంస్కృతికి చిహ్నాలు..
కాకతీయ కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించడం మనందరికీ గర్వకారణం. ఈ గుర్తింపు వెనక ప్రభుత్వ నిరంతర కృషి ఉన్నది. తెలుగు నేలపై తొలిసారి విశ్వవ్యాప్త గుర్తింపు పొందిన కట్టడంగా రామప్ప పేరు నేడు మారుమోగుతున్నది. తెలంగాణ చారిత్రక, ఆధ్యాత్మిక ఔన్నత్యానికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నది. అందులో భాగమే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం. ప్రాచీన కళలు, వారసత్వం, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలనే దృక్పథంతో ఇంత గొప్ప ఆలయాన్ని ఆధ్యాత్మిక కళ ఉట్టిపడేలా పునర్నిర్మించడం పట్ల భక్తులు, సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవ ఎంతో ఉన్నతమైంది. నేటి తరానికి ఆయన సేవలు గుర్తుండేలా శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాం. పీవీకి భారతరత్న ప్రకటించాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్రానికి పంపించాం.
కరోనాతో జాగ్రత్త..
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చింది. అయినా మూడో దశ గురించి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నందున పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంసిద్ధతతో ఉన్నది. ప్రజలూ జాగ్రత్తగా ఉండాలి. ప్ర భుత్వ పథకాల పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారు. తెలంగాణ భవిష్యత్తులో ఇంకా ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది. ఆశించిన గమ్యం, లక్ష్యం చేరుకోవాలంటే వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఉండాలి. ఈ మూడింటి మేళవింపుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజాభ్యుదయ పథంలో ముం దుకు సాగుతుందని రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నా.
ఉద్యమంగా దళితబంధు
దళిత జాతిని ప్రత్యేక శ్రద్ధతో ఆదుకోవడం నాగరిక సమాజం ప్రధాన బాధ్యత. అది ప్రజాస్వామిక ప్రభుత్వాల ప్రాథమిక విధి. అణగారిన దళితజాతి అభ్యున్నతికి పాటుపడటమే నిజమైన దేశభక్తి. అదే నిజమైన దైవసేవ. మానవసేవే మాధవసేవ అని మహాత్ముడు ఏనాడో చెప్పారు. ఈ దిశగా జరిగే ప్రయత్నాలకు సమాజమంతా అండగా నిలవాలి. ఈర్ష్య, అసూయలకు తావివ్వకుండా ఒక్క తాటిమీదికి వచ్చి దళిత సమాజానికి నమ్మకం ఇవ్వాలి. కులం పేరిట నిర్మించిన ఇనుప గోడలను, ఇరుకు మనస్తత్వాలను బద్దలుకొట్టాలి. దళితజాతి సమగ్ర వికాసానికి ఇప్పటివరకూ జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరగబోయేది ఇంకో ఎత్తు అనేలా ప్రభుత్వం దళితబంధు ఉద్యమానికి నాంది పలుకుతున్నది. అణగారిన దళితజనం ఒక్క ఉదుటున లేచి నిలబడి, స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే మహాసంకల్పానికి ఆచరణ రూపమే దళితబంధు. దళితులను ఆర్థికంగా బలోపేతంచేసి, సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కల్గించడమే లక్ష్యంగా స్వయంగా నేనే ఈ పథకానికి రూపకల్పన చేశాను. మహాత్మా జ్యోతీరావుఫూలే, బీఆర్ అంబేద్కర్ ఆలోచనల వెలుగులో రూపొందిన దళితబంధు పథకం.. దళితుల జీవితాల్లో నూతన కాంతిని నింపుతుందనే సంపూర్ణ విశ్వాసం ఉన్నది.
సమస్యలకు ఎదురొడ్డి.. ప్రగతి దిశగా
మహాత్మాగాంధీ సూచించిన అహింసా మార్గంలో రాష్ట్ర సాధన కోసం పోరాడి విజయం సాధించాం. స్వరాష్ట్రం సాధించుకున్న నాటి నుంచి సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా, ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపించే మార్గంలో ఎన్నో అవరోధాలు, సమస్యలు, సవాళ్ళు ఎదురైనా ప్రజల ఆశీర్వాద బలంతో వాటన్నిటినీ అధిగమించి పురోగమించగలుగుతున్నది. ఇప్పుడు అన్ని
రంగాల్లో గుణాత్మక అభివృద్ధిని ఆవిష్కరించగలిగాం. వాస్తవం కండ్ల ముందే కనపడుతున్నది. విద్యుత్తు, తాగు, సాగునీటి రంగాల్లో నేడు రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దీర్ఘ దృష్టితో రూపొందిన ప్రణాళికతో, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో పరిపాలన కొనసాగించటం వల్ల ఏడేండ్ల స్వల్పకాలంలోనే స్థిరమైన అభివృద్ధితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. 2013-14లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.4,51,580 కోట్లు. కొవిడ్ తీవ్ర అవరోధాలను సృష్టించినప్పటికీ 2020-21లో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,80,407 కోట్లుగా నమోదైంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు మన రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,12,126, నేడు రూ.2,37,632. దేశ తలసరి ఆదాయం రూ.1,28,829కన్నా తెలంగాణ తలసరి ఆదాయం రెట్టింపు ఉండటం గమనార్హం.
సంక్షేమంలో స్వర్ణయుగం
రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టిస్తున్నది. రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదు. సంక్షేమ ఫలాలు మరింత మందికి అందించేందుకు వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసును 57 ఏండ్లకు తగ్గించాం. పేదింటి ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని కల్యాణలక్షి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. చేనేత కార్మికులకూ ఆసరా పెన్షన్లు అందిస్తున్నది. రైతుబీమా తరహాలో త్వరలో ‘చేనేత బీమా’ అమలుచేయాలని నిర్ణయించాం. పేదలకు గౌరవప్రదమైన నివాసాలను కల్పించాలని ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్నది. ధనవంతులు నివసించే గేటెడ్ కమ్యూనిటీలకు సరిసాటిగా నిర్మించిన గృహ సముదాయాల్లో పేదలు నివసిస్తున్న అపూర్వ దృశ్యాన్ని రాష్ట్రంలో పలుచోట్ల ప్రభుత్వం ఆవిష్కరించింది. ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల మంజూరు కొనసాగుతున్నది. 3 లక్షల పైచిలుకు కొత్త కార్డులను మంజూరు చేసింది. ప్రజల ఆరోగ్య రక్షణకు అధునాతన వసతులతో కొత్త దవాఖానల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నగరాల్లో బస్తీ దవాఖానలు నెలకొల్పినట్టే దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రామాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నది. కేసీఆర్ కిట్స్ ప్రారంభించి, మహిళలు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవిస్తే రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేల ఆర్థిక సాయం, రూ.2 వేల విలువైన హెల్త్ కిట్ పంపిణీ చేస్తున్నది. రాష్ట్ర పౌరుల డిజిటల్ ఆరోగ్య నివేదిక రూపొందించే పనికి శ్రీకారం చుట్టింది.
దేశానికి ఆదర్శంగా మన పథకాలు
మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ. ఇట్లా అనేక రంగాల్లో మన రాష్ట్రం ఇతర రాష్ర్టాల కంటే మిన్నగా నిలిచింది. ఇతర రాష్ర్టాలవారు మన పథకాలను, కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నారు. అనతికాలంలోనే నూతన రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా మారిన అద్భుతాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించింది. కరెంటు కష్టాలకు చరమగీతి పాడిన రాష్ట్రంగా చరిత్రకెక్కింది. నేడు దేశంలో 24 గంటలూ అన్నిరంగాలకూ నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్న, రైతులందరికీ ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. నేడు మన స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 16,425 మెగావాట్లకు పెరిగింది. మన రాష్ట్రం నాలుగు వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నది. నల్లగొండ జిల్లాలో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న మొట్టమొదటి అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయరంగం కుప్పకూలిపోయింది. నిత్య విషాద ఘటనలతో తెలంగాణ తల్లడిల్లిపోయింది. ప్రభుత్వ అద్భుత కృషితో వ్యవసాయరంగంలో అసాధారణమైన అభివృద్ధి సాధ్యమైంది. 2020-21లో మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు 3.4 కోట్ల టన్నులు సాధించిన రాష్ట్రంగా దేశంలో అగ్రభాగాన నిలిచింది. రాష్ట్ర జీడీపీలో 20% వ్యవసాయరంగం సమకూరుస్తున్నది. తెలంగాణ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగింది. ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా అవతరించింది. 2013-14లో రాష్ట్రంలో దాదాపు 49 లక్షల ఎకరాల్లో వరిపంట సాగయితే, 2020-21లో కోటి ఆరు లక్షల ఎకరాల్లో సాగయింది. 60.54 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారు. 31.60 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయ్యింది. పత్తి సాగులో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది యాసంగిలో ఎఫ్సీఐ దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 56% మన రాష్ట్రమే అందించింది.