కాశీబుగ్గ, జనవరి 12: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు గురువారం కలాసి (గోల్డ్) రకం మిర్చి వచ్చింది. దీని ధర క్వింటాల్కు రూ.39 వేలు పలికింది. బుధవారం నాదరి ఎల్లో (గోల్డ్ కలర్) మిర్చి రాగా, క్వింటాల్కు రూ.40 వేలు పలుకగా రైతు సరుకు అమ్మకుండా కోల్డ్స్టోరేజీలో నిల్వ చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త రకం మిర్చి మార్కెట్ చరిత్రలోనే మొదటిసారిగా వచ్చినట్టు అధికారులు తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా వనపట్లకు చెందిన ఐదుగురు రైతులు 29 బస్తాలు తీసుకురాగా, క్వింటాల్కు రూ.39వేల చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. తేమ శాతం అధికంగా ఉండటంతో ధర తక్కువ పలికినట్టు వారు పేర్కొన్నారు. ఈ రకం పంటను ఏపీలోని గుంటూరు, కశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో పండిస్తారని వ్యాపారి సాంబయ్య తెలిపారు. తెలంగాణలో ఈ ఏడాది మొదటిసారిగా పండించినట్టు చెప్పారు. గోల్డ్ కలర్ మిర్చిని మహారాష్ర్టలోని జలగాం జిల్లాకు ఎగుమతి చేస్తున్నట్టు వ్యాపారి పేర్కొన్నారు.