హైదరాబాద్, ఆగస్ట్ 7 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2021-22) మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రాష్ట్ర ఆదాయం గణనీయంగా మెరుగుపడింది. మొత్తం రూ.24,629 కోట్ల రాబడి వచ్చింది. ఇది 2020-21 తొలి త్రైమాసికం (క్యూ1)లో వచ్చిన ఆదాయం కంటే 67 శాతానికిపైగా అధికం. వాస్తవానికి ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్ వల్ల ఏప్రిల్, మే నెలల్లో ఆశించినంత ఆదాయం రాలేదు. ముఖ్యంగా మేలో రాబడి గణనీయంగా తగ్గింది. సాధారణంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ రెవెన్యూ, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర పన్నులు కలిపి నెలకు రాష్ట్ర ఆదాయం కనీసం రూ.10-11 వేల కోట్లు ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులో సెకండ్ వేవ్ వల్ల రూ.8,054 కోట్లుగా ఆదాయం మాత్రమే వచ్చింది. మేలో లాక్డౌన్ వల్ల రూ.6,364 కోట్లకే పరిమితమైంది. జూన్లో లాక్డౌన్ పూర్తిగా ఎత్తేయడంతో కార్యకలాపాలు తిరిగి మొదలై ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే తొలిసారి జూన్లో ఆదాయం రూ.10 వేల కోట్ల మార్కు దాటింది. ఆ నెలలో మొత్తం రూ.10,222 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా మూడు నెలల్లో కలిపి ఖజానాకు రూ.24,629 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 13.98 శాతం.
గతేడాది కంటే మెరుగు
గతేడాది కరోనా మొదటి వేవ్, లాక్డౌన్తో ఏప్రిల్, మే నెలల్లో ఆదాయం గణనీయంగా పడిపోయింది. జూన్లో ఆంక్షలు సడలించడంతో కాస్త ఊరట దక్కింది. తొలి త్రైమాసికం లో మొత్తంగా రాష్ట్ర ఖజానాకు రూ.14,722 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 10.28 శాతం. ఈసారి కూడా సెకండ్వేవ్ ఇబ్బంది పెట్టినా గతేడాది తొలి త్రైమాసికం కంటే అదనంగా రూ.9,907 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా 67% పెరుగుదల కనిపించింది.