హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కే కేశవరావు అన్నారు. అమెరికాలోని అట్లాంటాలో పీవీ విగ్రహం ఏర్పాటుపై హైదరాబాద్లోని తన నివాసంలో మంగళవారం కమిటీ సభ్యులతో కేకే సమావేశమయ్యారు. భారత్ నుంచి విగ్రహం తరలింపు, తేదీల వివరాలు, కార్యక్రమ నిర్వహణపై చర్చించారు.
ఆవిష్కరణకు అట్లాంటాలోని మార్టిన్ లూథర్కింగ్ (ఎంఎల్కే) కుటుంబ సభ్యు లు, గాంధీ విగ్రహ ఫౌం డేషన్ ప్రతినిధులు, లోకల్ సెనేటర్లు, అమెరికా వ్యాప్తంగా ఉన్న పీవీ అభిమానులను ఆహ్వానిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. తెలంగాణ నుంచి ప్రముఖులను, పీవీ కుటుంబ సభ్యులను పిలుస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని ఈ సందర్భంగా కేశవరావు వారికి సూచించారు. కమిటీ సభ్యులు పీవీ ప్రభాకర్రావు, మహేశ్ బిగాల, చంద్రశేఖర్, అమెరికా ప్రతినిధి డాక్టర్ పాడీశర్మ సమావేశంలో పాల్గొన్నారు.