హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : వార్షిక పుష్పయాగం సందర్భంగా మంగళవారం టీటీడీలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. గార్డెన్ కార్యాలయం నుంచి తిరుమల ఆలయం వరకు టన్నులకొద్దీ వివిధ రకాల పూలు, ఆకులను ఊరేగింపుగా తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ మానవాళిని, పశు, పక్ష్యాదులను భూకంపాలు, తుఫానులు, అంటువ్యాధుల నుంచి రక్షించాలని కోరుతూ వార్షిక పుష్పయాగాన్ని నిర్వహించినట్టు తెలిపారు. చామంతి, మొగలి, కనకాంబరం, వివిధ రకాల గులాబీలు, తామరలు, లిల్లీలు, మనుసంపంగి, మనోరంజితంతో పాటు తొమ్మిది టన్నులకుపైగా పూలను వినియోగించామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ డీఈవో రమేశ్బాబు, ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, వీజీవోలు బాలిరెడ్డి, గిరిధర్, ఏవీఎస్వోలు గిరిధర్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.