హైదరాబాద్, మే 22 (నమస్తేతెలంగాణ) : వ్యవసాయ, పంట రుణాలకే బ్యాంకులు పరిమితం కాకుండా .. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మరింత ప్రోత్సాహం అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. శుక్రవారం ప్రజాభవన్లో 49వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) త్రైమాసిక సమావేశం జరిగింది. నాబార్డ్, సహకార, వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు, చురుకైన పాత్ర పోషించాలని కోరారు.
రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరాంతానికి మొత్తం డిపాజిట్లు రూ.9.43 లక్షల కోట్లకు, మొత్తం అడ్వాన్సులు రూ.12.33 లక్షల కోట్లకు చేరాయని, రాష్ట్ర క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 130.78 శాతంగా నమోదై జాతీయ సగటును మించి ఉందని మంత్రి తెలిపారు. ప్రధాన రంగ రుణాలు రూ.4.09 లక్షల కోట్లు, వ్యవసాయ రుణాలు రూ.1.87 లక్షల కోట్లకు చేరడం సంతోషకరమని పేరొన్నారు. పంట రుణాల పంపిణీ రూ.75,486 కోట్లకు చేరి, వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంలో 84.34 శాతం సాధించిందని, మొత్తం వ్యవసాయ, అనుబంధ రంగాలు, మౌలిక వసతుల కింద రూ.1,68,401 కోట్ల రుణాలు పంపిణీ చేసి 101.88 శాతం లక్ష్య సాధన నమోదు కావడం రాష్ట్ర బ్యాంకింగ్ వ్యవస్థ పురోగతిని సూచిస్తున్నదని తెలిపారు.