కడ్తాల్, జూలై 18: రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు నిరసన సెగ తగిలింది. పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు వస్తున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు ‘ఈటల గో బ్యాక్’ అని రాసిన ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా 40 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నదని, వచ్చే నెల 15 నుంచి మరో 11 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయట్లేదని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష కట్టిందని, తెలంగాణకి రావాల్సిన నిధులు ఇవ్వడంలో వివక్ష చూపుతున్నదని విమర్శించారు.