మహబూబాబాద్ : రాష్ట్రంలో 50 శాతం మంది మహిళలు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వీరికి ఆరోగ్య రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం ఆరోగ్య మహిళ పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) అన్నారు. కుటుంబంలోని మహిళ బాగుంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటుందని స్పష్టం చేశారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.అనంతరం మహిళా ఆరోగ్యం – ఇంటి సౌభాగ్యం పోస్టర్ ను ఆవిష్కరించారు.ఒకే రోజు 15నార్మల్ డెలివరీలు చేసిన వైద్య బృందాన్ని సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య మహిళ దవాఖానల్లో అటెండర్ నుంచి డాక్టర్ వరకు అందరూ మహిళలే ఉంటారని, మహిళలు(Womens) నిర్భయంగా వెళ్లి తమ ఆరోగ్య సమస్యలు చెప్పుకోవచ్చని సూచించారు.
అనంతరం రేడియాలజీ హబ్ ను మంత్రి పరిశీలించారు. ఆసుపత్రిలో పలువురు పేషెంట్లను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి వైద్యులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, జిల్లా కలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, డీఎంఅండ్హెచ్వో హరీశ్రాజ్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.