హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలోనూ ఆస్తిపన్ను భారీగా వచ్చింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 88శాతం ఆస్తిపన్ను వసూళ్లయ్యాయి. రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ ఏడాది రూ.803 కోట్లు లక్ష్యం కాగా రూ. 710 కోట్లు వసూలయ్యాయి. కరోనా నేపథ్యం, ఆస్తులను సర్వేచేసే సమయంలో పన్నుల చెల్లింపు వెబ్సైట్లను నిలిపివేసినప్పటికీ 88 శాతం పన్ను వసూళ్లు కావడంపై సంతృప్తి వ్యక్తమవుతున్నది. ఈ ఏడా ఆస్తిపన్నులు సహా ఇతర పన్నుల వసూళ్లలో ప్రభుత్వం ప్రత్యేక చర్య లు తీసుకున్నది. యజమానులు సులువైన విధానంలో చెల్లించేలా ఫోన్పే, గూగుల్పే సహా, వాట్సప్ తదితర పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కరోనా లాక్డౌన్ అమల్లో ఉన్నది. దీంతో లక్షల మంది ఉపాధి కోల్పోయారు. షాపులు మూతపడ్డాయి. అద్దె ఇండ్లను ఖాళీచేసి వెళ్లారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారీ లక్ష్యాన్ని చేరుకున్నట్టేనని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక అధికారులను నియమించింది. బకాయిదారులకు ఎస్ఎంఎస్లు పంపించడం, ప్రభుత్వ కార్యాలయాల బకాయిలపై కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించడం, టాప్ 500 బకాయిదారుల వివరాలను వెల్లడించడం, మొండి బకాయిదారులతో కమిషనర్ల సమావేశాలు, 90 శాతం వడ్డీని మాఫీచేసి వన్టైం సెటిల్మెంట్ విధానానికి అవకాశం కల్పించడం వంటి చర్యలు తీసుకున్నది.
ఇవీ కూడా చదవండి
మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్ లీవ్.. వోల్వో ఇండియా నిర్ణయం
నిరుపేదలకు వరం ‘కల్యాణలక్ష్మి’