హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చిన్నతరహా ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 15,000 యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. యూనిట్ల ఎంపిక, రాయితీల కల్పన తదితర బాధ్యతలను ఆయా జిల్లాల పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్కు అప్పగించింది. నీటి పారుదల ప్రాజక్టుల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాలవారీగా ప్రత్యేక ఆహార శుద్ధి మండళ్లను ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే.
ఈ మండళ్ల ఏర్పాటు కోసం ఇప్పటికే టీఎస్ఐఐసీ ఆయా జిల్లాల్లో కనీసం 500 ఎకరాలకు తగ్గకుండా సర్కార్ భూములను ఎంపిక చేసింది. పరిశ్రమల ఏర్పాటుకు 1400పైచిలుకు దరఖాస్తులు కూడా వచ్చాయి. ప్రభుత్వం టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద వివిధ రకాల రాయితీలను అందించనున్నది. ఈ క్రమంలోనే పీఎం ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎం ఎఫ్ఎంఈ) స్కీం కింద కేంద్రం ప్రత్యేకంగా చిన్నతరహా ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 15,000 యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ పథకం కింద 35 శాతం చొప్పున గరిష్ఠంగా రూ. 10 లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నారు.