హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో సకల జనులు, సబ్బండ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పరిపాలన సాగిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా వందలాది పోలీసు కుటుంబాల్లో వెలుగులు నింపారు. అర్హులైన ప్రతి ఒక్క పోలీసుకు పదోన్నతి దక్కాలనే దృఢనిశ్చయంతో ప్రమోషన్ల ఫైల్కు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఎస్సై నుంచి ఎస్పీ ర్యాంకు వరకూ 347 మంది పోలీసు అధికారులకు పదోన్నతి లభించింది. పోలీస్శాఖలోని అన్ని విభాగాల్లోనూ పదోన్నతుల ప్రక్రియ వేగంగా జరగాలని.. డీజీపీ అంజనీకుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించటంతో.. కేవలం నెలరోజుల్లోనే 347 మంది పోలీసు అధికారులకు పదోన్నతులు లభించాయి. వీటితోపాటు ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో వెయిటింగ్లో ఉన్న పలువురికి కొత్తగా పోస్టింగులు లభించాయి.
దశాబ్ది ఉత్సవాల్లోనే హెడ్కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ క్యాడర్ వరకూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జోన్లు, పలు విభాగాల్లో పనిచేస్తున్న 319 మందికి ప్రమోషన్లు దక్కాయి. దీంతో ఆ పోలీసు కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కిందిస్థాయి అధికారులను అప్రమత్తం చేసి, అర్హుల జాబితాను ఎంపికచేయటం వరకూ ప్రతీ దశలోనూ డీజీపీ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
సీఐడీ విభాగంలోని ఫింగర్ ప్రింట్ బ్యూరోకు చెందిన 9 మంది సబ్ ఇన్స్పెక్టర్లకు ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తున్నట్టు డీజీపీ అంజనీకుమార్ శనివారం తెలిపారు. వారి ప్రమోషన్ ఈ నెల 22వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించారు. పదోన్నతులు పొందిన వారికి తన కార్యాలయంలో సీఐ ర్యాంకు స్టార్స్ ధరింపజేశారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ కొత్తగా పదోన్నతి పొందిన అధికారులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలని చెప్పారు. పదోన్నతి పొందిన 9 మందిలో ఇద్దరు 2012 బ్యాచ్కు చెందిన వారు కాగా, ఏడుగురు 2014 బ్యాచ్కు చెందిన వారు. కార్యక్రమంలో సీఐడీ ఏడీజీ మహేశ్భగవత్, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో డైరెక్టర్ తాతారావు పాల్గొన్నారు.