హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిప్యూటీ వైస్ చాన్సలర్గా ప్రొఫెసర్ ఆర్ఎస్ సర్రాజు నియమితులయ్యారు. హెచ్సీయూలోని సెంటర్ ఫర్ దళిత్, ఆదివాసీ అండ్ ట్రాన్స్లేషన్ స్టడీస్ హెడ్గా ఉన్నారియన. ప్రొఫెసర్ సర్రాజు సెప్టెంబర్ 20, 1958 న ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు గ్రామంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (1977) నుండి పట్టభద్రుడయ్యాడు. 1979 లో విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి హిందీ భాష, సాహిత్యంలో ఎంఏ డిగ్రీ పొందారు. ది బర్త్ ఆఫ్ నావల్ లిటరేచర్ ఇన్ ఇండియా అనే అంశంపై ఆయన తన డాక్టోరల్ థీసెస్ను సమర్పించారు. 1984లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఫంక్షనల్ హిందీ, ట్రాన్స్లేషన్ స్టడీస్ అండ్ కంపారిటీవ్ ఇండియన్ లిటరేచర్లో సర్రాజు నిష్ణాతులు. హిందీ భాషా, సాహిత్యానికి చేసిన సేవలకుగాను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ సర్రాజుకు 1989లో మెరిట్ సర్టిఫికేట్ను ప్రదానం చేసింది. అదేవిధంగా బీహార్ ప్రభుత్వం 2015 లో డాక్టర్ జార్జ్ గ్రిర్సన్ అవార్డును ప్రదానం చేసింది.