కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలకపాత్ర
హైదరాబాద్, ఫిబ్రవరి 3 : ఆసియాలోనే అతిపెద్దదైన గ్లోబల్ బయోటెక్నాలజీ, లైఫ్సైన్సెస్ సదస్సు ‘బయో ఏషియా-2022’ 19వ ఎడిషన్ ‘జీనోమ్ వ్యాలీ ఎక్స్లెన్స్’ అవార్డు అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ డ్రివ్ వైజ్మాన్ను వరించింది. తెలంగాణ ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్ (ఎఫ్ఏబీఏ) ఆధ్వర్యం లో జరిగిన ఈ సదస్సులో నిర్వాహకులు ఆయనను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేశారు. ఎంఆర్ఎన్ఏ ఆధారిత కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో చేసిన కృషికిగాను ఆయనను ఈ అవార్డుకు ఎంపికచేసినట్టు బయో ఏషియా ప్రకటించింది. బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన వైజ్మాన్ పెన్సిల్వేనియా వర్సిటీలోని పెరెల్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్గా కొనసాగుతున్నారు. యూనివర్సల్ ఫ్లూ వ్యాక్సిన్, హెర్పిస్ వ్యాక్సిన్ సహా పలు వ్యాక్సిన్ల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. దీనికి గుర్తింపుగా టైమ్ మ్యాగజైన్-2021 ‘హీరోస్ ఆఫ్ ది ఇయర్’లో ఒకరిగా స్థానం కల్పించింది. లాస్కర్-డిబేకీ 2021తోపాటు లైఫ్సైన్సెస్-2022లో బ్రేక్త్రూ ప్రైజ్ను కూడా కైవసం చేసుకొన్న వైజ్మాన్.. క్యాన్సర్ థెరప్యూటిక్స్, ప్రొటీన్ థెరప్యూటిక్స్, జీన్ థెరపీలో ఎంతో ఖ్యాతి పొందారు.
యువతరానికి వైజ్మాన్ ప్రేరణ: కేటీఆర్
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధితో కొవిడ్ మహమ్మారి నుంచి కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడేందుకు దోహదం చేసిన డాక్టర్ వైజ్మాన్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. జీనోమ్ వ్యాలీ ఎక్స్లెన్స్ అవార్డును ఆయనకు అందజేయనుండటం గర్వకారణమని పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్ పట్ల డాక్టర్ వైజ్మాన్కు ఉన్న పట్టుదల వేలమంది పరిశోధకులను ప్రేరేపించిందని, ఆయన నేతృత్వంలో పెరెల్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అద్భుత విజయాలను సాధించిందని కొనియాడారు. నేటి యువత సైన్స్ను అభ్యసించేలా వైజ్మాన్ విజయాలు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.