Paddy Procurement | హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వానకాలం సీజన్ (2023-24) ధాన్యం కొనుగోళ్లు భారీగా తగ్గాయి. ఈ సీజన్లో పౌరసరఫరాల శాఖ ఇప్పటివరకు 44 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. నిరుడు ఇదే సమయానికి సుమారు 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, సీజన్ ముగిసేనాటికి 64.30 లక్షల టన్నులు కొనుగోలు చేయడం విశేషం. రాబోయే రోజుల్లో మరో 5 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. దీంతో ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు 50 లక్షల టన్నులకే పరిమితం అవుతాయనే అంచనాలు ఉన్నాయి. గత సంవత్సరంతో పోల్చుకంటే ఈసారి ధాన్యం కొనుగోళ్లు దాదాపు 14-15 లక్షల టన్నులు తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు అధికమొత్తంలో ధాన్యం కొనుగోలు చే యడమే ఇందుకు కారణమని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. అక్టోబర్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించిన పౌరసరఫరాల సంస్థ.. ఇప్పటివరకు ఎనిమిది లక్షల మంది రైతుల నుంచి సుమారు రూ. 9,500 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటికే రూ.8,500 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయగా మరో రూ.1,000 కోట్లు పెండింగ్లో ఉన్నట్టు సమాచారం.
రికార్డు వరి సాగు.. అయినా తగ్గిన కొనుగోళ్లు
వాస్తవానికి ఈ వానకాలంలో ఆల్టైం రికార్డు స్థాయిలో వరి సాగైంది. 65 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. దీంతో సుమారు 1.4 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో సగం ధాన్యం మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తారని, మరికొంత ధాన్యాన్ని రైతులు తమ వద్దే నిల్వ చేసుకుంటారని భావించిన పౌరసరఫరాల సంస్థ.. దాదాపు 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని అంచనా వేసింది. కానీ ఇందుకు విరుద్ధంగా ఇది 50 లక్షల టన్నుల వద్దే ఆగిపోతుండటం గమనార్హం.
మిల్లర్ల కొనుగోలు జోరు
ఈ సీజన్లో ఉత్పత్తి అయిన ధాన్యంలో ఎక్కువ భాగాన్ని మిల్లర్లు కొనుగోలుచేసినట్టు తెలుస్తున్నది. సాధారణంగా వానకాలం సీజన్లో దాదాపు 40 లక్షల టన్నుల వరకు మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులే కొనుగోలు చేస్తుంటారు. ఈసారి దాదాపు 70 లక్షల టన్నుల ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేసినట్టు సమాచారం. దీని వెనుక ఆసక్తికర కారణం కనిపిస్తున్నది. గతంలో పౌరసరఫరాల సంస్థ సీఎమ్మార్ కోసం ఇచ్చిన ధాన్యంలో సుమారు 30 లక్షల టన్నులు మిల్లర్ల వద్దే ఉన్నది. ఈ ధాన్యాన్ని మిల్లర్లు సొంత అవసరాలకు వినియోగించుకున్నట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎమ్మార్ను సమకూర్చేందుకు రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసినట్టు సమాచారం. ఒకవేళ ఇప్పుడు కొనుగోలు చేయలేని పక్షంలో ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నదనే గ్రహింపుతో మిల్లర్లు పోటీపడి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారని భావిస్తున్నారు.
వరి సాగు విస్తీర్ణం 65 లక్షల ఎకరాలు