హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): అన్నిరకాల భూ సమస్యలను పరిష్కారంపై దృష్టి పెట్టిన అధికారులు ధరణి పోర్టల్లో మార్పులు, చేర్పులను వేగవంతం చేశా రు. శుక్రవారం నుంచి గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్ మాడ్యూల్లో కొత్త ఫీచర్ను జతచేశారు. బాధితులు సమస్యను వివరిస్తే.. అధికారులు పరిశీలించి పరిష్కార మార్గాన్ని సూచించడం ఈ ఫీచర్ ప్రత్యేకత. ప్రతి ఫిర్యాదుకు కచ్చితంగా ఫోన్నంబర్, ఈమెయిల్ ఐడీ తీసుకుంటారు. ముందుగా గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్లో ‘ఫిర్యాదు స్వభావం’ (ఇష్యూ డిస్క్రిప్షన్) ఆప్షన్ ఎంచుకోవాలి. ఇందులో 10 రకాల సమస్యల కు చోటు కల్పించారు. వ్యవసా య భూమిని నాలా/ఇంటి స్థలాలుగా చూపడం, విస్తీర్ణం లో తప్పులు, రికార్డులో పేర్లు తప్పుగా నమోదు, సర్వే నంబర్ చూపకపోవడం వం టి ఆప్షన్లు కనిపిస్తాయి. ఇవేవీ కాకపోతే ‘ఇతరములు’ కింద సమస్యను వివరించవచ్చు. ఆప్షన్ ఎంచుకున్న తర్వాత కింద ఇచ్చిన ‘ఫిర్యాదు వివరణ’ బాక్స్లో సమస్యను తెలియపర్చాలి. చివరగా సంబంధిత పత్రాలను జతచేసి పంపాలి. అధికారులు దరఖాస్తును పరిశీలించి.. సదరు సమస్య పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో, మీసేవలో ఏ ఆప్షన్లో దరఖాస్తు చేయాలో ఫోన్కు, మెయిల్కు సందేశం పంపిస్తారు. ప్రత్యేకంగా కేటాయించిన వాట్సప్ నంబర్, మెయిల్కు ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులను సీసీఎల్ఏలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ పరిశీలిస్తున్నది. సమస్య పరిష్కారానికి ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేయాలో వివరిస్తూ వారికి సందేశాలు పంపుతున్నారు.
37 మాడ్యూల్స్
ధరణి పోర్టల్ ప్రారంభమై 8 నెలలు పూర్తయ్యాయి. ఈ కాలంలో మొత్తం 5.96 లక్షల లావాదేవీలు జరిగినట్టు అధికారులు తెలిపారు. 6.4 లక్షల స్లాట్లు బుక్ అయ్యాయన్నా రు. ప్రస్తుతం ధరణి పోర్టల్లో 29 ట్రాన్సాక్షన్ మాడ్యూల్స్, 8 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ మొత్తం 37 మాడ్యూల్స్ ఉన్నట్టు తెలిపారు. వీటిద్వారా 90 శాతానికిపైగా భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మిగతావి సర్వేతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు.