Inter Fees | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ఫస్టియర్కు రూ.1,760, సెకండియర్కు రూ.1,940. ఇవి ఇంటర్ విద్యార్థులు చెల్లించాల్సి ట్యూషన్ ఫీజులు. ఇది పేపర్పై మాత్రమే. కాలేజీలు తీసుకొనేది మాత్రం.. ఇంటర్ రెసిడెన్షియల్ ఫీజు ఏడాదికి అక్షరాలా మూడు లక్షలు. పేరున్న కాలేజీల్లో అయితే మరో రూ.50 వేలు అదనం. ఏసీ క్యాంపస్కో ఫీజు.. నాన్ ఏసీ క్యాంపస్కో ఫీజు.. ఆ క్యాంపస్లో అయితే ఓ రేటు. ఈ క్యాంపస్లో అయితే మరోరేటు. జేఈఈ, నీట్, లాంగ్టర్మ్, షార్ట్టర్మ్ ఇదీ ఫీజుల వరుస. ఒప్పుకున్న ఫీజులో 70 శాతం ఒకేసారి కట్టాల్సిందే. అది క్యాష్ పేమెంట్ మాత్రమే. ఇలా.. ఇంటర్ చదువులు ఫీజుల దరువుతో మోగిపోతున్నాయి. ఈ ఏడాది ప్రవేశాల షెడ్యూల్ విడుదల కాకముందే కాలేజీలు అడ్మిషన్ల జాతరకు తెరలేపాయి. నిబంధనలు ఉల్లంఘించి.. ఫీజలను భారీగా పెంచేశాయి. ఫిబ్రవరిలో ఉన్న ఫీజులు ఇప్పుడు లేవు..ఇప్పుడున్న ఫీజులు వచ్చే నెలలో ఉండవు. మొత్తంగా ఇంటర్ ఫీజులు రూ.4లక్షలు దాటే ప్రమాదం పొంచి ఉన్నది.
గాలికొదిలేసిన సర్కారు
ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ధనార్జనే ధ్యేయంగా నిబంధనలకు పాతరేస్తున్నాయి. రాష్ట్రంలో ఈ వ్యాపారం విలువ వేల కోట్లలో ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయినా.. ఫీజుల నియంత్రణను సర్కారు గాలికొదిలేసింది. ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. కార్పొరేట్ కాలేజీల మాఫియాను ఆదుపు చేయలేకపోతున్నది. దీంతో కాలేజీలు రెచ్చిపోతున్నాయి. ఇష్టారీతిన ఫీజులను పెంచేశాయి. సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డే విద్యాశాఖమంత్రి హోదాలో ఉన్నారు. కానీ ఇంతవరకు ఫీజులపై ఒక్క సమీక్షనూ నిర్వహించకపోవటం గమనార్హం.
కొటేషన్ ఇవ్వరు.. ఫోన్లు తీసుకెళ్లనివ్వరు
ఫీజుల వసూలు విషయంలో కాలేజీలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. తల్లిదండ్రులు అడ్మిషన్కు వెళితే ఓ పేపర్పై కొటేషన్ రాసి చూపిస్తారంతే. ఈ కొటేషన్ను తల్లిదండ్రులకు ఇవ్వరు. ఇలా చేస్తే దొరికిపోతామన్న ఆలోచనలో కాలేజీలు జాగ్రత్తపడుతున్నాయి. ఫొటోలు తీసుకుంటారేమోనని కనీసం సెల్ఫోన్లు కూడా అనుమతించరు. కొన్ని కాలేజీలు కట్టిన ఫీజు మొత్తానికి రశీదులు ఇవ్వటం లేదు. ఆన్లైన్ చెల్లింపులూ నిషిద్ధమే. నగదు ఉంటేనే ఫీజులు కట్టించుకుంటున్నాయి. చెక్కులను కూడా కొన్ని కాలేజీలు అనుమతించటం లేదు.
ఈ క్యాంపస్లలో ఫీజుల వాత
ఒకే విద్యాసంస్థ నిర్వహిస్తున్న క్యాంపస్లలో ఫీజుల్లో వ్యత్యాసం ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి, క్యాంపస్ను బట్టి ఫీజులు గుంజుతున్నారు. నాగోల్ నీట్ (ఏసీ క్యాంపస్)లో ఫీజులు రూ.2 లక్షల పైమాటే. కూకట్పల్లి, నిజాంపేట, బాచుపల్లి, నాగోల్, కొల్లూరు క్యాంపస్లలో ఫీజులు రూ.2.5 లక్షలు దాటాయి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీల్లోని కాలేజీల్లో ఫిబవరి వరకు ఫీజు రూ.2.5 లక్షలు ఉండగా, పదో తరగతి పరీక్షలు పూర్తికాగానే ఏకంగా రూ.లక్ష పెంచారు. దీంతో ఫీజు రూ.3.5 లక్షలకు చేరింది. మాదాపూర్ మెయిన్ క్యాంపస్లో అడ్మిషన్ కోసం ఎంత చెబితే అంత ఫీజు కట్టేందుకు సిద్ధమైనా ఎగ్జామ్ రాయకుండా అడ్మిషన్ ఇవ్వరు. హైదరాబాద్ నల్లకుంటలోని పలు కాలేజీల్లోనూ రూ.2.5 లక్షల వరకు ఫీజు తీసుకుంటున్నారు.
పలు రాష్ర్టాల్లో ఇలా..
ఫీజుల నియంత్రణలో పలు రాష్ర్టాలు ముందంజలో ఉన్నాయి. పటిష్టమైన విధానాలను అనుసరిస్తున్నాయి. రాజస్థాన్లో ఫీజులను ఖరారు చేసేందుకు 3 కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలోని ఈ కమిటీలు ఫీజులను ఖరారు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు మూడేండ్లకుగానూ ఒకేసారి ఫీజులను ఖరారుచేసి, అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలకు వేర్వేరు ఫీజు విధానాన్ని అమలు పరుస్తున్నారు. గుజరాత్లో 2017-18 నుంచి నిర్దిష్ట ఫీజు విధానాన్ని అమలు చేస్తున్నారు. రాష్ర్టాన్ని నాలుగు జోన్లుగా విభజించి స్కూళ్లవారీగా ఫీజులను ఆన్లైన్లో పొందుపరిచారు. మన దగ్గర ఫీజుల నియంత్రణను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఇంటర్బోర్డు సైతం ప్రైవేట్ కాలేజీలు అంటే తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నది.
ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి
కార్పొరేట్ కాలేజీలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నాయి. విద్యార్థులను అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. కనీస ఫీజులను వాయిదాల్లో చెల్లించే అవకాశం ఇవ్వటం లేదు. ఇంటర్బోర్డు నియంత్రణలో ఈ కాలేజీలున్నాయా? లేవా? అన్న అనుమానం కలుగుతున్నది. అనుమతులిచ్చే వరకే ఇంటర్బోర్డు పరిమితం అవుతున్నది. రాష్ట్రప్రభుత్వం పటిష్టమైన ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ఈ కాలేజీల దోపిడీని అడ్డుకోవాలి.
– చింతకాయల ఝాన్సీ
కామన్ ఫీజు విధానాన్ని రూపొందించాలి
ఇంటర్ చదివే వారిలో అత్యధికులకు ఫీజులే ప్రధాన సమస్య. కార్పొరేట్ కాలేజీల్లో ఫీజులు చెల్లించలేక అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఫీజుల చెల్లించలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగుచూశాయి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి కామన్ ఫీజు విధానాన్ని రూపొందించాలి. లేదంటే విద్యార్థులను సమీకరించి ఉద్యమిస్తాం.
– శ్రీకాంత్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి