రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్టుల్లా ఎందుకు ఉండకూడదు? విమానాశ్రయాలకన్నా మెరుగైన సదుపాయాలను రైల్వే స్టేషన్లలో కల్పించాలని మేం భావిస్తున్నాం. రైల్వే స్టేషన్లను నవీకరించాల్సిన అవసరం ఉన్నది. దీనిపై నేను రైల్వే అధికారులతో చర్చించాను. మేం అతి త్వరలో పని ప్రారంభిస్తాం. కొద్ది రోజుల్లోనే మీరు మంచి మార్పును చూస్తారు.
ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సరిగ్గా 40 రోజులకు, 2014 జూలై 5న నరేంద్ర మోదీ అన్న మాట ఇది. అంతకుముందటి కేంద్ర ప్రభుత్వం నిర్మించిన, 25 కిలోమీటర్ల కాట్రా- ఉధంపూర్ రైల్వే లైనును జమ్ములో ప్రారంభిస్తూ ఆయన ఈ కల చూపించారు. నమ్మినం!
రాజధాని ఎక్స్ప్రెస్ రైలు చక్రంలాగే కాల చక్రం గిర్రున తిరిగింది. 8 ఏండ్లు గడిచిపోయాయి. ఈసారి తేదీ 2022 మే 26. అంటే సరిగ్గా 4 రోజుల క్రితం. తాజా వేదిక చెన్నై. రైల్వే ప్రాజెక్టులకు భూమి పూజ సందర్భం.
ప్రధాని మోదీ ఆలోచన మేరకు రైల్వే స్టేషన్లను అద్భుతంగా, చక్కటి సదుపాయాలతో, ముచ్చటగొలిపే ఇంటీరియర్స్తో, కళ్లకు కట్టే ఆంబియన్స్తో, పార్కింగ్ సౌకర్యాలతో… ఒక్కమాటలో చెప్పాలంటే మోదీ కోరుకున్నట్టు, విమానాశ్రయాలను తలదన్నే తరహాలో జిగేల్మనేలా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని రైల్వే మరోసారి ప్రకటించింది. తుమ్మినం!!
ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది నిన్న తీసిన ఫొటో. 8 ఏండ్ల క్రితం మోదీ చెప్పినట్టు ఇది ఎయిర్పోర్టులా మారిందా? ఇక్కడ ఎస్కలేటర్లు పని చేయవు. ఉన్న పది ప్లాట్ఫాంలపై కూర్సుండ కుర్సీ ఉండదు. వెయిటింగ్ రూములు చాలవు. టాయిలెట్లు దొరకవు. ఈ ఫొటో చూశారు కదా! ఫ్లాట్ ఫాం నంబర్ 1లో ఎలివేటర్ ఎప్పుడో ఆగిపోయింది. దాన్ని పట్టించుకున్న నాథుడు లేడు. పొరపాటున దానిపైకి ఎవరూ వెళ్లకుండా అలా అత్యాధునికంగా రేకులు అడ్డుపెట్టి మరీ ఆపుతున్నారు. దాని ముందు చిన్నా పెద్దా ముసలీ ముతక కింద పడుకొని పడిగాపులు కాస్తున్నవాళ్లంతా ప్రయాణికులు. వారికి ఎయిర్పోర్టు సౌకర్యాలు కాదు.. స్టేషన్లోనే చుక్కలు కనిపించాయి. నిండా మునిగినం!!!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏమన్నా చిన్నా చితకదా? మొత్తం 19 రైల్వే జోన్లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే హెడ్క్వార్టర్ సికింద్రాబాద్. ఉత్తర దక్షిణ భారత దేశాల వారధి ఈ స్టేషన్. తెలంగాణలో ఉన్న అతి పెద్ద స్టేషన్. రోజూ లక్షలాది ప్రయాణికులు వచ్చిపోయే స్టేషన్. అయినా కేంద్ర ప్రభుత్వానికి కనబడదేమో అనుకుంటే, ఇది ఘనత వహించిన కేంద్ర మంత్రి శ్రీమాన్ కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ స్థానం నడిబొడ్డున ఉన్న స్టేషన్!
ఆస్తుల్నే కాదు.
ఆస్తుల్నే కాదు. మాటల్ని కూడా అమ్మొచ్చు!
కండ్ల ముందు రంగుల కలలను పరిచి…
అబద్ధాలు రంగరించి అమ్మడం కొత్త కళ!
మన చేతులు చప్పట్లు కొడుతున్నంత కాలం
వాళ్ల చేతులు మన కండ్లు మూస్తూనే ఉంటాయి!!
తెలంగాణ అభివృద్ధికి పోరాటం చేస్తామన్న ప్రధాని మోదీ మాటలు విని, ఓ ప్రయాణికుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దుస్థితి గురించి నమస్తే తెలంగాణకు ఫోన్ చేసి చెప్పారు. ఇదీ.. మాటలకు, చేతలకు ఉన్న తేడా! ఎవడో ప్రైవేటు కంపెనీ పెట్టుకుని అభివృద్ధి చేసుకుని యూనికార్న్గా మారిస్తే ఆ ఘనత తమదని చెప్పుకొనే తెంపరితనం, ఐటీఐఆర్ను రద్దు చేసి కూడా హైదరాబాద్ను టెక్ హబ్ చేస్తామని చెప్పుకునే బడాయితనం వారి సొంతం.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 28 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతనే ఉండదు. రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టుల్లా మార్చేస్తానని చెప్పి ఎనిమిదేండ్లయింది. ఇప్పుటికీ దేశంలోని మెజారిటీ రైల్వే స్టేషన్లు బర్ల కొట్టాలకంటే దరిద్రంగా దర్శనమిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 160-170 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. రోజుకు 1.50 లక్షల నుంచి 1.70 లక్షల మంది ప్రయాణికులు వస్తూ పోతూ ఉంటారు. కానీ, ఈ స్టేషన్లో కాసేపు కూర్చోవటానికి కూడా కనీస సౌకర్యాలు లేవు. బీజేపీ అధికారంలో ఉన్న ఈ ఎనిమిదేండ్లలో ఉన్నవాటిని మెరుగుపరిచింది లేదు.. సౌకర్యాలు పెంచిందీ లేదు.
స్టేషన్లో పది ప్లాట్ఫాంలు ఉన్నాయి. ఎక్కడా ఒక్క కుర్చీ కూడా లేదు. పిల్లర్ల చుట్టూ ఉండే అరుగుల మీదే ఒకరిపై ఒకరు కూర్చోవాలి. లేదంటే రైలు వచ్చే వరకు కాళ్లు నొప్పులు పుట్టేలా నిలబడాలి. ఇంత పెద్ద స్టేషన్లో పట్టుమని పది టాయిలెట్లు ఉన్నాయి. అవీకూడా దుర్గంధం పాడుబడినట్టుగా దర్శనమిస్తున్నాయి. స్టేషన్లో దివ్యాంగులు, వృద్ధుల కోసం కనీసం 20 వీల్ చైర్లు ఉండాలి. కానీ నాలుగు మాత్రమే ఉన్నాయి.
ఎస్కలేటర్లు ఉన్నా పని చేయడం లేదు. ఒకటో నంబరు ప్లాట్ఫాంకు సంబంధించిన ఎస్కలేటర్ పని చేయక చాలా రోజులైంది. దీంతో సిబ్బంది దానికి రేకులు అడ్డుగా పెట్టి మూసివేశారు. మిగిలిన ఎస్కలేటర్లదీ అదే పరిస్థితి. బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా అవి పని చేయడంలేదని సిబ్బంది చెప్తున్నా, అవి నడవక చాలా రోజులైందని ప్రయాణికులు అంటున్నారు. నిత్యం లక్షల మంది ప్రయాణికులు వచ్చే ఈ స్టేషన్లో మూడు ఏసీ, ఒక జనరల్, మరికొన్ని అప్పర్ క్లాస్ విశ్రాంత గదులు మాత్రమే ఉన్నాయి. వీటన్నింటిలో గరిష్ఠంగా మూడు-నాలుగు వేల మంది.. అదీ కిక్కిరిసినట్టుగా ఉంటే తప్ప విశ్రాంతి తీసుకోలేని పరిస్థితి ఉన్నది. దీంతో ఏ ప్లాట్ఫాంపై చూసినా ప్రయాణికులు నేలమీద కూర్చోవాల్సి వస్తుంది.
రైల్వే స్టేషన్లకు వచ్చే ప్రయాణికుల్లో 90 శాతం పేద, మధ్య తరగతి ప్రజలే ఉంటారు. ఈ నేపథ్యంలో పబ్లిక్-ప్రైవేటు-పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో స్టేషన్ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించినా అందుకు ఏ కార్పొరేట్ కంపెనీ ముందుకు రాలేదు. విమానాశ్రయాలను నిర్మించిన కార్పొరేట్ సంస్థలు ఆ మేరకు ప్రయాణికుల నుంచి తిరిగి రాబడతాయి. షాపింగ్ మాల్స్ వంటి వాటితో ప్రయాణికుల నుంచి లాక్కుంటాయి. కానీ అంత కొనుగోలు సామర్థ్యం లేని రైల్వే ప్రయాణికుల నుంచి పీపీపీ విధానంలో డబ్బులు రాబట్టేందుకు ఏ సంస్థ ముందుకు రాదు. ఈ విషయం తెలిసినప్పటికీ కేంద్రం ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నదనే విమర్శలున్నాయి.