హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించారు. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్రమంత్రి ఉషా శ్రీచరణ్, ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రశాంతి నిలయానికి చేరుకుని సత్యసాయి మహాసమాధిని రాష్ట్రపతి దర్శించుకున్నారు.
ఆ తర్వాత పుట్టపర్తిలో సాయిహీరా ఇంటర్నేషనల్ సెంటర్కు రాష్ట్రపతి చేరుకున్నారు. సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని 14 మందికి డాక్టరేట్లు, 21 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ స్నాతకోత్సవంలో ఆమె ప్రసంగించారు. అనంతరం రోడ్డు మార్గాన సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు.