హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకిచ్చే ఉచిత పాఠ్యపుస్తకాల ముద్రణకు అవసరమైన పేపర్ను తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెప్పిస్తున్నది. అక్కడి తమిళనాడు పేపర్ మిల్స్ నుంచి 2,500 టన్నుల పేపర్ రెండు మూడు రోజుల్లో రాష్ర్టానికి రానున్నది. ఈ ఏడాది 2.10 కోట్ల పాఠ్యపుస్తకాలు ముద్రించాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో 1.70 లక్షల పుస్తకాలే ముద్రించగా, ఈ ఏడాది 40 లక్షల పుస్తకాలు అదనంగా అవసరమని అధికారులు నిర్దారించారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభిస్తుండటంతో ప్రతి పుస్తకాన్ని తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ముద్రించనున్నారు. దీంతో పుస్తకాల సంఖ్య పెరిగింది. వీటి ముద్రణకు 8,500 టన్నుల పేపర్ అవసరం ఉండగా, మొదటి విడత ముద్రణకు 5 వేల టన్నుల పేపర్ కావాల్సి ఉన్నది. ఇందులో 2,500 టన్నుల పేపర్ను కోయంబత్తూరు నుంచి తెప్పిస్తున్నారు. సాటితా పేపర్ మిల్స్ నుంచి వెయ్యి టన్నులు, రుచిర పేపర్ మిల్స్ నుంచి వెయ్యి టన్నుల పేపర్ను టెండర్ల ద్వారా సమీకరిస్తున్నారు. ఇప్పటికే రెండు వేల టన్నుల పేపర్ రాష్ర్టానికి చేరుకొన్నది. కోయంబత్తూరు నుంచి పేపర్ రాగానే పుస్తకాల ముద్రణ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.