హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): కందిమళ్ల శ్రీకాంత్, వీణ.. శ్యామలపాటి లక్ష్మీ భరత్, లహరి.. ఇలా ఎందరో యువ దంపతులు.. ప్రభుత్వ ఉద్యోగాలపై గురిపెట్టారు. నిన్నటి దాకా సంసార సాగరాన్ని ఈదిన యువ దంపతులు ఇప్పుడు పుస్తకాలతో ప్రేమాయణం సాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి తీరాలన్న పట్టుదలతో బ్యాచిలర్స్ మాదిరిగా శ్రమిస్తున్నారు. 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన మరుక్షణమే అటక మీద ఉన్న పుస్తకాలను కిందకు దించేశారు.
కంబైడ్ స్టడీ మొదలు పెట్టేశారు. ఇద్దరిలో ఒక్కరమైనా ఉద్యోగం కొట్టి తీరాలన్న పట్టుదలతో ప్రిపరేషన్ సాగిస్తున్నారు. పెండ్లితో వాయిదాపడ్డ ఆశయ సాధనకు పునరంకితం అవుతున్నారు. ఇంటి పనిని చెరిసగం పంచుకొంటూ.. ప్రతి దానికీ టైంటేబుల్ వేసుకొని ప్రణాళికబద్ధంగా సాగిపోతున్నారు. టీ తాగేటప్పుడు, భోజనం సమయంలో సైతం వేరే అంశాలను రానీయకుండా సబ్జెక్టు డిస్కషన్స్ మీదనే దృష్టి సారిస్తున్నారు. ఒకరి మనసు మరొకరు తెలుసు కాబట్టి.. బలాలు, బలహీనతలను నిర్మొహమాటంగా చర్చించుకొంటున్నారు. తమకు తామే పరీక్షలు పెట్టుకొంటూ బలహీనంగా ఉన్న టాపిక్స్పై మరింత శ్రద్ధ పెడుతున్నారు.
ఒకటే లక్ష్యం.. ఒకటే మాట!
భార్యాభర్తలు ఇద్దరూ ఒకే మాటమీద ఉంటే ఏ విషయంలోనైనా విజయం తథ్యం. ఉద్యోగ సాధనలో ఇద్దరూ ఒకటే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. సినిమాలు, షికారులు, ఫంక్షన్లు అన్నీ బంద్ పెట్టేశారు. మరీ తప్పదనుకొంటే ఎవరో ఒకరే వెళ్లి అటెండెన్స్ వేయించుకొని వస్తున్నారు. పూర్తి సమయం ప్రిపరేషన్కు వెచ్చిస్తున్నారు.
ఆర్థిక వనరులను బేరీజు వేసుకుంటూ…
సరైన ఆర్థిక వనరులు లేకపోతే ప్రిపేర్ కావడం కష్టం. కోచింగ్, పుస్తకాల ఖర్చులు, ఇతర అవసరాలకు డబ్బు సమకూర్చుకోలేక ఎకువమంది మధ్యలోనే విరమించే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆర్థిక వనరుల విషయంలోనూ కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటే.. అందులో ఒకరు ఉద్యోగాన్ని త్యాగం చేసి, మరొకరు కంటిన్యూ చేస్తున్నారు. ఒకవేళ ఉద్యోగ సాధనలో విజయం సాధించలేకపోతే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. భార్యాభర్తల ప్రిపరేషన్ సత్ఫలితాలు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. మౌలిక అంశాల అధ్యయనం, విషయ పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకోవడం, లోతైన అధ్యయనం వంటి అనేక విషయాలకు దంపతుల స్టడీ విధానం దోహదపడుతుందని అంటున్నారు.
గ్రూప్-1 జాబ్ సాధిస్తాం
ఇద్దరం పీజీ పూర్తి చేశాం. ఉద్యోగం సాధించాలనేది మా ఇద్దరి కల. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన రోజే కలిసి శ్రమిద్దామని నిర్ణయించుకొన్నాం. టైంటేబుల్ సిద్ధం చేసుకొన్నాం. ఏయే పుస్తకాలు చదవాలి? రోజుకు ఎన్ని గంటలు చదవాలి? ఎవరెవరు ఏ సమయంలో చదవాలి? వంటి అన్ని విషయాలతో ప్రణాళిక వేసుకొన్నాం. ఇంటి పనిచేసేటప్పుడు కూడా నిపుణుల సలహాలు, సూచనలు వింటున్నాం. వినోదాలకు గుడ్బై చెప్పేశాం. ఫోన్లు పక్కన పెట్టేశాం. ఇద్దరిలో ఒక్కరం అయినా తప్పకుండా గ్రూప్-1 జాబ్ సాధించాలన్న పట్టుదలతో శ్రమిస్తున్నాం.
– కందిమళ్ల శ్రీకాంత్, వీణ దంపతులు, మణుగూరు, భద్రాద్రి జిల్లా
ఉద్యోగ నోటిఫికేషన్లు ఓ వరం
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది మా ఇద్దరి ఆశయం. కానీ, పెండ్లి అయిన తర్వాత బాధ్యతల్లో పడిపోయాం. సీఎం కేసీఆర్ ప్రకటనతో మళ్లీ ఉద్యోగంపై ఆశలు చిగురించాయి. ఇద్దరం కలిసే ప్రిపేర్ అవుతున్నాం. ఇంటి పనిని కూడా ఇద్దరం పంచుకొంటున్నాం. ఇంట్లోనే వారానికి రెండురోజులు పరీక్ష పెట్టుకొంటున్నాం. వీక్గా ఉన్న టాపిక్స్పై శ్రద్ధ పెడుతున్నాం. ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొన్నాం. అందులో సలహాలు, సూచనలు పంచుకొంటాం. ప్రస్తుత భారీ నోటిఫికేషన్ మాకో వరం.
– శ్యామలపాటి లక్ష్మీభరత్, లహరి దంపతులు, ఖమ్మం