న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: బోర్డు పరీక్షల విధానంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. నూతన విద్యా విధానం ప్రకారం 12వ తరగతి బోర్డు పరీక్షలు గతంలో లాగే రెండు విడతలుగా నిర్వహిస్తారు. అలాగే 10, 12 తరగతుల తుది పరీక్షల ఫలితాల్లో అంతకు మందు ఏడాది విద్యార్థి చదివిన తరగతిలోని మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు నేషనల్ కరికులమ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్సీఎఫ్) ముసాయిదాను సిద్ధం చేసింది. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) మార్గదర్శకాలతో తయారు చేసిన ఈ ముసాయిదా ప్రకారం 11, 12 తరగతుల్లో ఇప్పుడు అమలవుతున్న సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, కామర్స్ విభాగాల విధానం కాకుండా నూతన సబ్జెక్టులను తెస్తారు. వొకేషనల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్ ఎడ్యుకేషన్, సోషల్ సైన్స్, సైన్స్, హ్యుమానిటీస్, మ్యాథమేటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనే 8 సబ్జెక్టులను ప్రవేశపెడతారు.
వీటిలో కొన్నింటిని విద్యార్థి తన అభిరుచికి తగ్గట్టు ఎంచుకోవచ్చు. నిరంతర, విస్తృత మూల్యాంకన విధానాన్ని 2009లో 10వ తరగతి కోసం ప్రవేశపెట్టినా, దానిని 2017లో ఎత్తివేసి పాత పద్ధతిలోనే ఏడాదికొకమారే పరీక్షలు నిర్వహించారు. అయితే కరోనా సమయంలో 10, 12 తరగతులకు బోర్డు పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించినా, ఈ ఏడాది తిరిగి పాత విధానంలోనే విద్యా సంవత్సరం ఆఖరున ఒక్కసారి మాత్రమే పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా తయారైన ముసాయిదా ప్రకారం 11, 12 తరగతులకు ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని ప్రతిపాదించారు. కేంద్ర విద్యా శాఖ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఈ ముసాయిదా తుది దశ పరిశీలనలో ఉంది. ప్రజల, ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఈ విధానాన్ని 2024 నుంచి అమలు చేయాలని విద్యా శాఖ యోచిస్తున్నది.