హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రైతు బీమా తరహాలో చేనేత కార్మికులకు బీమా ధీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్కమిటీ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రైతుబీమా తరహాలోనే 18-59 ఏండ్ల వయస్సు ఉన్న నేతన్నలకు బీమా వర్తింపజేయాలని నిర్ణయించింది.
రైతు బీమా తరహాలోనే చేనేత కార్మికులు మరణిస్తే రూ.5 లక్షల బీమా సొమ్మును ఎల్ఐసీ అందజేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 55,072 మంది చేనేత కార్మికులకు బీమా కల్పించాలని సబ్కమిటీ సూచించింది. ఒక్కో చేనేత కార్మికుడికి జీఎస్టీ రూ.828తో కలిపి మొత్తం రూ.5,426 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. ఏటా 55,072 మంది చేనేత కార్మికుల ప్రీమియం రూ.29.88 కోట్లను ఎల్ఐసీకి ప్రభుత్వమే చెల్లించనున్నది. ఈ ప్రతిపాదనలతో సిద్ధం చేసిన ఫైల్ను ప్రభుత్వ ఆమోదానికి సబ్కమిటీ పంపింది.
చేనేత బీమాను ప్రకటించిన సీఎం కేసీఆర్కు బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని నేతన్నలకు రూ. 5 లక్షల బీమా అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ప్లీనరీలో బీసీ పాలసీని ప్రకటించడాన్ని స్వాగతించారు. బీమా పాలసీ వర్తింపు వయస్సు నిబంధనను 59 ఏండ్ల నుంచి 70 ఏండ్లకు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.