ప్రీమియర్ ఎనర్జీస్ పునరావృత పెట్టుబడి
హైదరాబాద్లో ప్లాంట్ విస్తరణ
2.5 గిగావాట్ల సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ ప్లాంట్ల ఏర్పాటు
అమెరికన్ కంపెనీ అజ్యూర్తో జోడీ
మూడు వేల మందికి ఉద్యోగాలు
4 ఏండ్లలో 4వేల కోట్ల ఉత్పత్తులు
కంపెనీ ప్రతినిధులకు అనుమతి పత్రాలు అందించిన మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో అమలవుతున్న స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలకు ప్రీమియర్ ఎనర్జీస్, అజ్యూర్ సంస్థల పునరావృత పెట్టుబడే నిదర్శనం. వీటి విస్తరణకు అదనంగా 20 ఎకరాల భూమిని కేటాయించాం. ఈ-సిటీలో ఈ కంపెనీ అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణకు గర్వకారణం. ఈ సంస్థల విస్తరణ ప్రణాళికకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం.
–మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోలార్ సెల్స్, మాడ్యూల్స్ను తయారు చేస్తున్న ప్రీమియర్ ఎనర్జీస్ గ్రూపు హైదరాబాద్లోని తమ ప్లాంటును మరింత విస్తరించనున్నది. ఇందుకోసం అమెరికన్ సంస్థ అజ్యూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. దీనిలో భాగంగా ఈ రెండు సంస్థలు రూ.700 కోట్ల పునరావృత (రిపీట్) పెట్టుబడితో 1.25 గిగావాట్ల సోలార్ సెల్స్, 1.25 గిగావాట్ల సోలార్ మాడ్యూళ్ల తయారీకి అత్యాధునిక ప్లాంట్లను ఏర్పాటు చేస్తాయి. వీటి నుంచి వచ్చే నాలుగేండ్లలో ప్రీమియర్ ఎనర్జీస్ రూ.4 వేల కోట్ల విలువైన 2.5 గిగావాట్ల సోలార్ సెల్స్, మాడ్యూల్స్ను సరఫరా చేస్తుంది. తద్వారా ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా మరో 2 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. తద్వారా హైదరాబాద్లోని ఈ-సిటీలో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన సంస్థగా ప్రీమియర్ ఎనర్జీస్ గ్రూప్ ఎదగనున్నది. తెలంగాణ ప్రభుత్వంతోపాటు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో సౌర విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉన్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.
స్నేహపూర్వక విధానాలకు నిదర్శనం: కేటీఆర్
తెలంగాణలో ప్రీమియర్ ఎనర్జీస్, అజ్యూర్ పునరావృత పెట్టుబడి పెట్టడాన్ని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. రాష్ట్రంలో అమలవుతున్న స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలకు ఈ పెట్టుబడే నిదర్శనమని పేర్కొన్నారు. సోమవారం ఆయన ప్రగతిభవన్లో ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై ఈ-సిటీలో నూతన ప్లాం ట్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతి పత్రాలను అం దజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ మెగా ప్రాజెక్ట్స్లో భాగంగా ప్రీమియర్ ఎనర్జీస్ విస్తరణ ప్రణాళిక అమలు కోసం ఈ-సిటీలో అదనంగా 20 ఎకరాల భూమిని కేటాయించినట్టు చెప్పారు. ఈ-సిటీలో ఈ కంపెనీ అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణకు గర్వకారణమన్నారు. దీని ద్వారా సదరు కంపెనీలు మరింత భారీస్థాయికి ఎదుగుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రీమియర్ ఎనర్జీస్, అజ్యూర్ కార్యకలాపాలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
ప్రపంచస్థాయి ప్లాంట్ల ఏర్పాటు: అలన్ రోస్లింగ్
తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడి న ప్రపంచస్థాయి సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు అజ్యూర్ పవర్ చైర్మన్ అలస్ రోస్లింగ్ తెలిపారు. భారత్లోని అత్యం త అధునాతన సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ సంస్థల్లో ఒకటైన ప్రీమియర్ ఎనర్జీస్కు భాగస్వామిగా ఉండటం తమ సంస్థకు గర్వకారణమని చెప్పారు. ఈ భాగస్వామ్యం తమ వాటాదారులకు స్థిరమైన లబ్ధి చేకూరేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. ప్రీమియర్ ఎనర్జీస్ చైర్మన్ సురేందర్ పాల్సింగ్ మాట్లాడుతూ.. తమ కంపెనీ విస్తరణకు తెలంగాణ ప్రభు త్వం పారిశ్రామిక అనుకూల విధానాలే కారణమని తెలిపారు. అజ్యూర్ పవర్తో భాగస్వామ్యం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నదని చెప్పారు. 27 ఏండ్ల నుంచి ఈ రంగంలో ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ మున్ముందు ఎత్తుకు ఎదిగేందుకు ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందన్నారు.