హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): భద్రాచలం దాని పరిసర ప్రాంతాలపై గోదావరి వరదల ప్రభావం, ముంపునకు గల కారణాలు? చేపట్టాల్సిన నివారణ చర్యలు తదితర అంశాల అధ్యయనానికి ఏర్పాటైన ప్రత్యేక నిపుణుల కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఇప్పటికీ వరద కొనసాగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా చేపట్టాల్సిన నివారణ చర్యలపై పలు సిఫారసులు చేసింది. దీనిపై సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ జలసౌధలో మంగళవారం సమీక్షించారు.
భద్రాచలం వద్ద ముంపునకు గలకారణాలను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నదని కమిటీ వెల్లడించింది. పోలవరం డ్యామ్ పూర్తయి, ఎఫ్ఆర్ఎల్ మేరకు నీరు నిల్వ చేసినట్లయితే భద్రాచలం వద్ద ముంపు మరింత తీవ్రంగా ఉంటుందని అంచనా వేసింది. తెలంగాణ భూభాగంలో గోదావరిపై పలు చోట్ల కరకట్టల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించింది. అదేవిధంగా ఏపీలోని ఎటపాక ఎగువన కరకట్టల నిర్మాణం జరగలేదని, వాటిని వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. భద్రాద్రి ముంపుపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని నొక్కిచెప్పింది. పోలవరం పూర్తయిన అనంతరం నెలకొనే పరిస్థితులు, నిలిచే బ్యాక్ వాటర్ లెవల్స్ను పరిగణలోకి తీసుకుని శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని కమిటీ స్పష్టం చేసింది. సమావేశంలో కమిటీ కన్వీనర్, భద్రాద్రి కొత్తగూడెం సీఈ శ్రీనివాసరెడ్డి, సభ్యులు ములుగు సీఈ విజయ్భాస్కర్రావు, సీడీవో సీఈ శ్రీనివాసరావు, కాన్టెక్ సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.