హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నదని, వాటిని సాదరంగా స్వీకరించాలని హార్వర్డ్ యూనివర్సిటీ పూర్వ అధ్యాపకుడు స్టీవ్ జార్డింగ్ పిలుపునిచ్చారు. ఆయా సవాళ్లకు తగిన పరిష్కారాలు చూపేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. గురువారం పటాన్చెరువు రుద్రారంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. వర్తమానతరం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ప్రస్తావించారు. గ్లోబల్ వార్మింగ్ 20వ శతాబ్దపు అతిపెద్ద సమస్య అని, ఈ సమస్య ప్రజలకు అర్థంకావడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు.
బ్రెజిల్లోని వర్షాధార అడవులను ఉదహరించిన ఆయన ప్రపంచంలో 25 శాతం ఆక్సిజన్ను అందించే ఈ అడవులను గనుల తవ్వకం, పారిశ్రామిక ప్రయోజనాలకు వాడటంతో అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతున్నదని చెప్పారు. 2030 నాటికి చైనా, అమెరికా, ఐరోపా దేశాలు, భారత్ ప్రపంచంలో నాలుగు శక్తులుగా ఆధిపత్యాన్ని చెలాయిస్తాయని అభిప్రాయపడ్డారు.
పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు యువత ముందుకురాని పక్షంలో భూతాపం పెరిగి అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుందని, అనేక దీవులు మునిగిపోతాయని, తద్వారా 80 శాతం తీరప్రాంత జనాభా శరణార్ధులుగా మారిపోతారని హెచ్చరించారు. సత్జ్ఞానంతో భవిష్యత్తు తరం వనరులను కాపాడుకోవడం, సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిజ్ఞ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, ప్రొఫెసర్ ఎన్ సీతారామయ్య, శ్రీధర్ పబ్బిశెట్టి, సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.