హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మోడల్ స్కూల్స్ సొసైటీలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీని వర్తింపజేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఫిజికల్ డైరెక్టర్లు, క్లర్క్ కమ్ అకౌంటెంట్ (డాటా ఎంట్రీ ఆపరేట్), ఆఫీస్ సబార్డినేట్ / నైట్ వాచ్మెన్ల వేతనాలను పెంచారు. రెగ్యులర్ ఉద్యోగులకు గతంలో పీఆర్సీ ఇవ్వగా.. తాజాగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం వర్తింపజేశారు. ఫిజికల్ డైరెక్టర్లకు వేతనం ఇదివరకు రూ.17,500 ఉండగా.. తాజాగా రూ. 22,750కి పెంచారు. క్లర్క్ కమ్ అకౌంటెంట్కు రూ.15 వేల నుంచి రూ.19,500, ఆఫీస్ సబార్డినేట్ / నైట్ వాచ్మెన్కు రూ.12 వేల నుంచి రూ.15,600కు పెంచుతూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిర్ణయంతో 776 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధిచేకూరనున్నది. పీఆర్సీపై తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూతం యాకమల్లు, కొంతము నగేశ్, పీఎంటీఏ టీఎస్ నాయకులు జగదీశ్ హర్షం వ్యక్తంచేశారు.