హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రసాద్’ (పిలిగ్రిమేజ్ రిజువెనేషన్ అండ్ స్పిరిచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్) పథకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా ఈ విషయమై పార్లమెంట్లో గొంతెత్తలేదని విమర్శించారు. రాష్ట్రంలో అనేక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ కేంద్రం వాటికి సముచిత ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఆరోపించారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) చైర్మన్గా గెల్లు శ్రీనివాస్యాదవ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని జలవిహార్లో ఏర్పాటుచేసిన అభినందన సభలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్యాదవ్, మ హమూద్ అలీ తదితరులు గెల్లును అభినందించారు. అనంతరం వినోద్కుమార్ మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధి, హిందువుల ప్రయోజనాల గురించి చెప్పుకొనే కేంద్రం రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు.
ఉద్యమంలో తనతో కలిసి నడిచి విశ్వాసంగా పనిచేసినవారిని ఉన్నతస్థానాల్లో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని పర్యాటకాభివృద్ధి శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. గెల్లు శ్రీనివాస్ ఉద్యమంలో సైనికుడిగా పనిచేశారని, అందుకే ఆయనకు తగిన గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని బెస్ట్ టూరిజం స్పాట్గా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషిచేస్తానని గెల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, ఎల్ రమణ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.