హైదరాబాద్ : రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో ప్రకృతి వనాలు, మండల కేంద్రాల్లో బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్రంలో రూ.116 కోట్ల వ్యయంతో 19,472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామని, వీటిలో 19,413 (99.9%) పూర్తి చేశామని ఆయన తెలిపారు. ప్రగతిలోని 59 వనాలను పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
‘‘పల్లె ప్రకృతి వనాలకు మంచి స్పందన రావడంతో మండలానికి ఒకటి చొప్పున బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మండల కేంద్రంలో భూమి లేనిచోట మేజర్ పంచాయతీలో పది ఎకరాల స్థలంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయనున్నాం. ఒక్కొక్క ప్రకృతి వనం ఏర్పాటుకు రూ. 40 లక్షలు ఖర్చు చేయనున్నాం. వీటిలో 31 వేల మొక్కలను పెంచుతాం. ఇందుకోసం ఇప్పటివరకు 535 మండలాల్లో ఐదు వేల 300 ఎకరాల భూమిని గుర్తించాం. మిగతా పది మండలాల్లో భూమి ఎంపిక వెంటనే పూర్తి చేస్తాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల అమలుతో గ్రామాల్లో పచ్చదనం పరిఢ విల్లుతున్నది’’ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.