హైదరాబాద్, మార్చి 30(నమస్తే తెలంగాణ) : ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్లో టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఫలితాలు, డీఎస్సీ(ఉపాధ్యాయ నియామక పరీక్ష) పరీక్షలను వాయిదా వేయాలని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ముందు ప్రకటించిన విధంగా డీఎస్సీ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు, టెట్ ఫలితాలను ఈనెల 14న విడుదల చేయాల్సి ఉంది. ఇంతవరకు డీఎస్సీ హాల్టికెట్లను విడుదల చేయకపోగా, 14న విడుదల చేయాల్సిన టెట్ ఫలితాలు కూడా వెల్లడికాలేదు. దీంతో అభ్యర్ధులు సందిగ్ధంలో పడ్డారు. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా… టెట్ ఫలితాలతోపాటు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికలు పూర్తయ్యేకే కొత్త తేదీలను ప్రకటించే అవకాశముంది.
వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీకి బ్రేక్
ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీలో వలంటీర్ల సేవలకు సీఈవో ముకేశ్ కుమార్ మీనా బ్రేక్ వేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయరాదని నిర్ణయించినట్లు ఆయన శనివారం ఆదేశించారు. వారి స్థానంలో నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్లు, మొబైల్ ఫోన్లను కూడా ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయాలని మీనా ఆదేశించారు.