హైదరాబాద్ ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): తడిపార్ కౌన్ హై..? బేగంపేట విమానాశ్రయంతోపాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కనిపిస్తున్న ఈ పోస్టర్లు ఆకర్షిస్తున్నాయి. మునుగోడు సభ కోసం వచ్చిన అమిత్షా తొలుత బేగంపేట విమానాశ్రయంలో దిగారు. ఆ సమీపంలో ‘తడీపార్ కౌన్ హై.. బై.. బై మోదీ’ అంటూ రెండు హ్యాష్ట్యాగ్లతో వెలిసిన పోస్టర్పై సోషల్, జాతీయ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతున్నది. తడీపార్ అంటే ఏమిటి? అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు.. సదరు వ్యక్తిని ఘటన జరిగిన ప్రాంతంలో లేదా జిల్లాల్లో లేదా రాష్ట్రంలో అడుగుపెట్టకుండా కోర్టు ఇచ్చే ఆదేశాలనే ‘తడీపార్’ అంటారు.
2005లో సోహ్రాబుద్దీన్ అనే వ్యక్తి, ఆయన భార్య, ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో హత్యకు గురయ్యారు. వారు తీవ్రవాదులని.. అందుకే చంపేశారని గుజరాత్లోని మోదీ ప్రభుత్వం వాదించింది. ఆ సమయంలో గుజరాత్ హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్షా కార్యాలయం నుంచి సోహ్రాబుద్దీన్ను చంపాలని పలు ఫోన్కాల్స్ వెళ్లినట్టు సీబీఐ నివేదికలో పేర్కొన్నది. ఈ వ్యవహారంలో అరెస్టయిన అమిత్షాకు 3 నెలల తరువాత బెయిల్ ఇచ్చిన గుజరాత్ కోర్టు.. ఆయనపై తడీపార్ విధించింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు గుజరాత్లో ప్రవేశించవద్దని ఆదేశాలు జారీ చేసింది.