కరీంనగర్ కార్పొరేషన్, మే 8: నామినేటెడ్ పదవులను అమ్ముకున్నారని, నాలుగు దశాబ్దలుగా కాంగ్రెస్ కోసం పని చేస్తున్న తనకు అధిష్టానం అన్యాయం చేసిందని కరీంనగర్ సీనియర్ నాయకుడు సుధగోని లక్ష్మీనారాయణగౌడ్ మండిపడ్డారు. నలభై ఏండ్లుగా పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వకపోతే పార్టీ ఎలా ముందుకు పోతుందని ప్రశ్నించారు. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్ష, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కరీంనగర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్గౌడ్, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, అర్బన్ డీసీసీ అధ్యక్షుడు అంజన్కుమార్తోపాటు ఇతరులు కూడా మద్దతు పలికి ప్రభుత్వానికి సూచించారని తెలిపాడు. పార్టీకి సంబంధం లేకున్నా పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బులు ఉన్నాయంటూ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని పోటీ చేసినా వెలిచాల రాజేందర్రావును ప్రజలు ఓడించారని గుర్తుచేశారు.
పార్టీ కోసం పని చేస్తున్న తమకు కాకుండా ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఆకుల నర్సయ్యకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన ఆకుల నర్సయ్య ఇటీవల కార్పొరేటర్ ఎన్నికల్లో మేయర్ పదవి కోసం రూ.3 కోట్లు తీసుకున్నారని, ఇప్పుడు మార్కెట్ కమిటీ ఛైర్మన్ కోసం కూడా రూ.50 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు ఏ రోజు కూడా రాజేందర్రావును నాయకుడిగా గుర్తించలేదని, డబ్బులతోనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు నెలల క్రితం పార్టీలోకి వచ్చిన వారి వద్ద డబ్బులు తీసుకొని నామినేటెడ్ పదవులు ఇచ్చారని విమర్శించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్రెడ్డి కలిసి సీఎం పైరవీ ద్వారా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇద్దరు మంత్రులు, జిల్లా నాయకత్వం ప్రతిపాదించినా తమకు పదవులు ఇవ్వలేదంటే డబ్బుతోనే పదవులొచ్చాయని భావిస్తున్నామని పేర్కొన్నా రు. ఇన్చార్జిగా చెప్పుకొంటున్న రాజేందర్రావును తొలగించాలని డిమాండ్ చేశారు.