హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్ బాలి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఉదయం వైజాగ్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. బాలి అసలు పేరు మేడిశెట్టి శంకరరావు. చిన్నతనం నుంచి బాలికి చిత్రలేఖనంపై ఆసక్తి ఉండేది. హైదరాబాద్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా చేరినా చిత్రలేఖనంపై మక్కువతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
1974లో ఈనాడు విశాఖపట్నం ఎడిషన్లో కార్టూనిస్ట్గా చేరారు. 1976లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో స్టాఫ్ ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యారు. అప్పటి ఆంధ్రజ్యోతి వారపత్రిక ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్యశర్మ మేడిశెట్టి శంకరరావు పేరును బాలిగా మార్చారు. తెలుగు పత్రికా రంగంలో బాలి బొమ్మలు ఒక ప్రత్యేక శైలికి ఒరవడి దిద్దాయి. పలు కథలు, నవలలకు బొమ్మలు వేయడమే కాకుండా వేలాది కార్టూన్లు కూడా బాలి బ్రష్ నుంచి జాలువారాయి. అంతర్జాతీయ కార్టూన్ పోటీలలోనూ బాలి కార్టూన్లు బహుమతులు పొందాయి. బాలి కుమారుడు గోకుల్ ఇటీవల మంచు ప్రమాదంలో చిక్కుకొని మరణించారు. బాలి కుమార్తె వైశాలి అమెరికాలో ఉంటున్నారు.