హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య వసతులను కల్పించాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గ్రామాల్లో నాణ్యమైన వైద్యం అందించడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని కోరారు. దేశంలో వైద్య వసతులను పెంచుకోవాల్సిన అవసరాన్ని కరోనా గుర్తుచేసిందని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని ‘అసోసియేషన్ ఆఫ్ నేషనల్ బోర్డ్ అక్రిడిటేటెడ్ ఇన్స్టిట్యూషన్స్’ (ఏఎన్బీఏఐ) ఆధ్వర్యంలో వైద్య అధ్యాపకులకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతోపాటు హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రతి వెయ్యిమంది రోగులకు ఒక వైద్యుడు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చెప్తున్నదని, మన దేశంలో మాత్రం 1,456కి ఒక డాక్టర్ ఉన్నారని చెప్పారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ప్రతి జిల్లా కేంద్రానికి ఒక వైద్య కళాశాలను ఏర్పాటుచేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఉన్నత విలువలతో విద్యాబోధనను అందించేందుకు ఏఎన్బీఏఐ కృషిచేస్తున్నదని అభినందించారు.
ఆలోచనలు పెంచుకోవాలి.. పంచుకోవాలి
ఆలోచనలు పెంచుకోవడం, నలుగురితో పంచుకోవడం మంచి అలవాటని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్కు చెందిన ఆరుగురు మహిళా రచయిత్రులు శనివారం హైదరాబాద్లో ఉపరాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో 100 మందికి పైగా రచయిత్రులు రాసిన వివిధ కథలతో ‘కరోనా కాలం కథలు’ పేరిట రుద్రమ సాహిత్య, సామాజిక అధ్యయన వేదిక వెలువరించిన ప్రత్యేక సంకలనాన్ని ఉపరాష్ట్రపతికి అందించారు. వెంకయ్యనాయుడిని కలిసినవారిలో కే రామలక్ష్మి, అనిశెట్టి రజిత, తిరునగరి దేవకీదేవి, బండారు సుజాత, మురాడి శ్యామల, తమ్మెర రాధిక ఉన్నారు.