వేములవాడ, అక్టోబర్ 2: ‘బండి సంజయ్.. నీవు చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర ఉద్దేశం ఏమిటో చెప్పాలి’ అని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్గౌడ్ ప్రశ్నించారు. శనివారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా.. అధికార పార్టీ ఎంపీగా ఈ రెండేండ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తెచ్చిన నిధులు లెక్క ప్రజాక్షేత్రంలో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మీ పాదయాత్ర వల్ల మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు తెచ్చావా? అని నిలదీశారు. పార్లమెంటు సమావేశాలకు హాజరై నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధి, నియోజకవర్గ సమస్యలపై ఎన్నిసార్లు ప్రస్తావించావో చెప్పాలన్నారు. ‘నీ యాత్రలు ప్రచారానికి తప్పా దేనికి పనికిరావు’ అని ఎద్దేవా చేశారు. యాత్రలతో ప్రజలను మభ్యపెట్టడం మాని, అభివృద్ధిపై దృష్టిసారించాలని సూచించారు. చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి సహకరిస్తే బాగుంటుందని హితవు పలికారు.