హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ నాంపల్లిలోని తన కార్యాలయంలో విడుదలచేశారు. ఈ పరీక్షలో 75.73 శాతం విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఎంపీసీలో గుజ్జుల వర్షిత, ఎంబైపీసీలో కల్లివరపు చంద్రశేఖర్కు మొదటి ర్యాంక్లు వచ్చాయి. వర్షిత 120కి 120 మార్కులు సొంతం చేసుకొన్నది. కల్లివరపు చంద్రశేఖర్ ఎంపీసీలో నాలుగో ర్యాంక్, ఎంబైపీసీలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ తెచ్చుకొన్నాడు. 1,04,362 విద్యార్థులకు పరీక్ష రాయగా ఎంపీసీలో 79,038, ఎంబైపీసీలో 79,117 విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. బాలికలు 79. 99% ఉత్తీర్ణత సాధించగా, బాలురు 72.12% క్వాలిఫై అయ్యారు.
పాలిసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను కూడా బుధవారం విడుదలచేశారు. ఈ నెల 18 న తొలి విడత, ఆగస్టు 1న తుదివిడత కౌన్సెలింగ్ జరుగుతుం ది. ఆగస్టు 8 నుంచి 16 వరకు విద్యార్థులకు ఓరియంటేషన్ నిర్వహిస్తారు. ఆగస్టు 17 నుంచి పాలిటెక్నిక్ కోర్సుల తరగతులు ప్రారంభిస్తారు. అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ డిప్లొమా కోర్సులకు సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్స్ను సంబంధిత వర్సిటీలు వేర్వేరుగా విడుదల చేస్తాయి.
పాలిసెట్లో నిర్ణీత మార్కులకు గాను 30 శాతం అంటే 36 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టే లెక్క. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మాత్రం 1 మార్కు వచ్చినా క్వాలిఫై అయినట్టే. ఈ కోటాలో సీట్లు ఉంటే 1 మార్కు వచ్చినా సీటు కేటాయిస్తారు. అంతకుముందే నిండిపోతే మాత్రం సీట్లు దక్కవు. ఈ కోటాకు సంబంధించి ఎం పీసీ, ఎంబైపీసీ స్ట్రీమ్లలో 28,765 మంది హాజరైతే అందరూ క్వాలిఫై అయ్యారు.