MLC Elections | హైదరాబాద్ : ఖమ్మం – వరంగల్ – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ సమయం ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 4 గంటల్లోపు క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. సుమారు 60 శాతం దాకా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఉప ఎన్నిక ఫలితం జూన్ 5వ తేదీన వెల్లడి కానుంది.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆ నియోజకవర్గానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీపడుతున్నారు.