విద్యానగర్, డిసెంబర్ 15 : బండరాళ్ల మధ్య చిక్కుకొని నరకయాతన అనుభవించిన షాడ రాజు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డాడు. 43 గంటలు తీవ్రంగా శ్రమించిన అధికారులు రాజును బయటికి తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన రాజు మంగళవారం సింగరాయిపల్లి అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లాడు. రాజు సెల్ఫోన్ జారి బండరాళ్ల మధ్యలో పడింది. దాన్ని తీసే క్రమంలో జారిపడి బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. వెంట వెళ్లిన స్నేహితుడు అశోక్.. రాజును బయటికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. వీలుకాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. గురువారం ఘటనాస్థలానికి వెళ్లిన ఎస్పీ శ్రీనివాస్రెడ్డి బండరాళ్ల మధ్య ఇరుక్కున్న రాజుతో మాట్లాడారు.
అధికారులు, రెస్క్యూ బృందానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. 43 గంటలపాటు శ్రమించి 7 బండ రాళ్లను పగులగొట్టి ఎట్టకేలకు రాజును సురక్షితంగా బయటికి తీశారు. వెంటనే వైద్యులు అతనికి ఆక్సిజన్ పెట్టి అంబులెన్స్లో హుటాహుటిన కామారెడ్డిలోని ఏరియా దవాఖానకు తరలించారు. డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శోభారాణి మాట్లాడుతూ.. బండరాళ్ల మధ్యలో పడిపోవడంతో రాజు భుజానికి, చేతులకు గాయాలయ్యాయని తెలిపారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు రాజు ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని పేర్కొన్నారు.
బతుకుతానని అనుకోలేదు..
నేను బతుకుతానని అనుకోలేదు. పోలీస్, రెవెన్యూ, అటవీ అధికారులు, వైద్యులు రెండు రోజులపాటు శ్రమించి నన్ను ప్రాణాలతో బయటికి తీశారు. నా స్నేహితుడు అశోక్ కూడా ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ వచ్చాడు. నా ధైర్యమే నన్ను బతికించింది. నన్ను కాపాడేందుకు శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
-రాజు, మృత్యుంజయుడు
రాజుకు ధైర్యం చెప్తూ వచ్చాను..
అధికారుల సూచన మేరకు రాజుకు ధైర్యం చెప్తూ వచ్చాను. వైద్యాధికారుల సూచనల మేరకు పండ్ల రసాలు, ఓఆర్ఎస్ పైప్ ద్వారా అందించాను. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి రాజు బయటికి వచ్చే వరకు 30 సార్లు రాజు వద్దకు వెళ్లాను. అధికారులు బయటికి తీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని.. త్వరలోనే బయట పడతావని రాజును మాట్లాడిస్తూ ధైర్యం చెప్పాను. అధికారులు ఎంతో శ్రమించి రాజును సురక్షితంగా బయటికి తీసినందుకు ధన్యవాదాలు.
– ఉప్పరి అశోక్, రాజు స్నేహితుడు