ఖైరతాబాద్, మే 8 : ‘నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను ఆపొద్దు’ అన్న సీఎం రేవంత్రెడ్డి మాట మళ్లీ తుస్సుమన్నది. సీఎం కాన్వాయ్ వస్తున్నదని శుక్రవారం హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న రవీంద్రభారతి వద్ద పోలీసులు ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపేశారు. దీంతో నడి ఎండలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో కూడా రేవంత్రెడ్డి ఇదే హామీ ఇచ్చారు. ఇటీవల సీఎం కాన్వాయ్ శంషాబాద్ వెళ్తుండగా, చాలాసేపు వాహనాలు నిలిపేశారని పలువురు వాహనదారులు పోలీసులపై అసహనం వ్యక్తంచేశారు. ఈ విషయం తెలిసి తన కాన్వాయ్ వెళ్తుంటే ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలిగించొద్దని ఆ మరునాడే సీఎం పోలీస్ శాఖను ఆదేశించారు.
ఆ తర్వాత శంషాబాద్ నుంచి జూబ్లీహిల్స్లో ఉన్న తన నివాసానికి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ను నిలిపివేయకుండానే సీఎం కాన్వాయ్ వెళ్లింది. ఈ విషయంపై వివిధ సామాజిక ప్రసార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే శుక్రవారం మధ్యాహ్నం రవీంద్రభారతి చౌరస్తా మీదుగా సీఎం కాన్వాయ్ వస్తున్నదని పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నలువైపులా ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేశారు. దీంతో కోఠి, లక్డీకాపూల్, ట్యాంక్బండ్ వైపునకు వెళ్లే వాహనదారులు ఎండవేడిమికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం కేవలం మాటలకేనని, చేతల్లో ఏమీ ఉండదంటూ ఈ సందర్భంగా పలువురు వాహనదారులు అసహనం వ్యక్తంచేశారు.