Sircilla | సిరిసిల్ల జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నకిలీ వీసాలతో మోసం చేస్తున్న గల్ఫ్ ఏజెంట్లపై జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు నకిలీ ఏజెంట్లపై కేసులు నమోదు చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ మహబూబ్ (53), రుద్రంగికి చెందిన బొండు అంజయ్య (55), గంభీరావుపేట మండలం నిర్మాల గ్రామానికి చెందని ఓరుగంటి రాములు (39)పై కేసులు నమోదు చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే వారిని నికలీ వీసాలతో మోసం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఏడాది 19 కేసుల్లో నకిలీ ఏజెంట్లను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని సూచించారు. నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. విచారణ జరిపి నేరం రుజువైతే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.