లగచర్ల: వికారాబాద్ జిల్లా లగచర్ల (Lagacharla) రైతులపై మరోపిడుగు పడింది. ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూసేకరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా భూసర్వే నిర్వహిస్తున్నది. దీంతో లగచర్లలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. జిల్లాలోని దుద్యాల మండలం హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా అసైన్డ్ భూములను సేకరించనున్నట్టు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
లగచర్లకు చెందిన 102 సర్వే నంబర్లో 43 మంది రైతులకు సంబంధించి 47.25 ఎకరాలు, రోటిబండత తండాలో అదే 102 సర్వే నంబర్లో 30 మంది రైతులకు చెందిన 22 ఎకరాలు, పులిచెర్లకుంట తండాలో 117. 120,121 సర్వే నంబర్లలోని 20 మంది రైతులకు చెందిన 40.15 గుంటలకు సంబంధించి భూసర్వే చేయనున్నట్టు దుద్యాల తహసీల్దార్ కిషన్ ఇప్పటికే వెల్లడించారు. లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంట తండాలో మొత్తంగా 110 ఎకరాల అసైన్డ్ భూములకు సర్వే చేపట్టి ఆయా రైతులకు సంబంధించి హద్దులను గుర్తించనున్నట్టు తెలిపారు. నిన్నటిదాక ఫార్మా!.. ఇప్పుడు పారిశ్రామిక క్లస్టర్!.. ప్రభుత్వం తమను ఎందుకిలా వేధిస్తున్నదని దుద్యాల మండల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ భూముల జోలికి రావొద్దని వేడుకుంటున్నారు. తాము పోరాడి అలసిపోయామని, అయినా ప్రభుత్వం పదే పదే తమను వేధిస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.