గద్వాల, జూన్ 16: తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి రైతుబీమా సొమ్ము కాజేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి, రూ.5 లక్షలు రికవరీ చేశారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకొన్నది. ఎస్పీ రంజన్ రతన్కుమార్ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. గట్టు మండల కేంద్రానికి చెందిన మల్లమ్మ బతుకు దెరువు కోసం కర్ణాటకలోని రాయిచూర్కు వలస వెళ్లింది. ఈ సమయంలో రైతుబంధు డబ్బుల కోసం వరుసకు కొడుకైన, వార్డు సభ్యుడు నాగరాజుకు వ్యవసాయ భూమి పాస్బుక్తోపాటు ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా నంబర్ అందించింది. ఇదే అదునుగా భావించిన నాగరాజు.. అతడి స్నేహితుడు ఆలమంచి రాజు అలియాస్ రాజప్పతో చేతులు కలిపాడు. ఇద్దరూ కలిసి రైతుబీమా సొమ్ము కాజేసేందుకు కుట్ర పన్నారు.
అదే గ్రామానికి చెందిన నరసమ్మ మృతి చెందగా.. ఆమె పేరుకు బదులుగా బతికి ఉన్న మల్లమ్మ పేరు మీద డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని గట్టుకు చెందిన అంగన్వాడీ టీచర్ శశిరేఖకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. అక్కడి నుంచి గ్రామ కార్యదర్శి సుభావతిని కలిసి డెత్ సర్టిఫికెట్ కావాలని అడిగాడు. ఆమె 2021 డిసెంబర్ 23న మల్లమ్మ మరణించినట్టు ధ్రువీకరణ పత్రం అందజేసింది. తర్వాత తప్పుడు ధ్రువపత్రాలతో రైతుబీమాకు దరఖాస్తు చేశారు. 2022 ఫిబ్రవరి 15న రైతుబీమా కింద రూ.5 లక్షలు ఎస్బీఐ ఖాతాలో జమయ్యాయి. అదే నెల 18న నాగరాజు, రాజప్ప బ్యాంకులో రూ.3 లక్షలు డ్రా చేశారు. అయితే డబ్బుల విషయమై ఇద్దరూ గొడవపడ్డారు. తర్వాత రాజప్ప నకిలీ బాగోతాన్ని బట్టబయలు చేశాడని ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసిన గట్టు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.