హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నవారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కవులు, రచయితలు తమ కలాలకు పదునుపెట్టి విచ్ఛిన్నకర శక్తులను దునుమాడాలని కోరారు. దేశం క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న ఈ సమయంలో సుహృద్భావ వాతావరణం సృష్టించడానికి సాహిత్యకారులు కృషి చేయాలని విజ్ఞప్తిచేశారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఆజ్తక్ (ఇండియా టుడే) సాహిత్య సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు.
సాహిత్యంలో విశేష కృషిచేసిన వారికి వచ్చే ఏడాది నుంచి భారత్ జాగృతి ఫౌండేషన్ – ఇండియూ టుడే సంయుక్తంగా సాహ్యిత పురసారం అందిస్తాయని ప్రకటించారు. సాహిత్యం జ్ఞానాన్ని ఇవ్వటంతోపాటు సమాజంలో మంచి వాతావరణం సృష్టించేలా ఉండాలని పేర్కొన్నారు. కవులు, రచయితలను ప్రోత్సహించడానికి ఈ అవార్డును నెలకొల్పామని తెలిపారు. సాహిత్యకారులను సన్మానించుకొంటే సమాజ గౌరవం పెరుగుతుందని అన్నారు. ‘యువతకు సాహిత్యం అర్థంకాదని, భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడంలో కలిసి రావడం లేదని కొంత మంది అంటున్నారు. కానీ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొనడం గర్వంగా ఉన్నది. సాహిత్య ప్రేమికురాలిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నా’ అని తెలిపారు.