హైదరాబాద్ : ఉత్పత్తి కులాలైన వృత్తి కలాలన్నీ ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం ఆవిష్కృతమవుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. ప్రముఖ కవయిత్రి జ్వలిత సంపాదకత్వం వహించిన మల్లెసాల (శతాధిక చేతి వృత్తుల కథలు) మహా గ్రంథాన్ని ఆయన ఆదివారం రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. శతాధిక చేతి వృత్తుల కథల సంకలనం తెచ్చిన జ్వలితను అభినందించారు.
ఈ సందర్భంగా గౌరీ శంకర్ మాట్లాడుతూ..బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారి జీవన వృత్తి కథలన్నీ ఉధృతంగా వస్తున్నాయని తెలిపారు. సమస్త వృత్తి రచనలన్నీ లేకపోతే తెలుగు సాహిత్యం సమగ్రం కాదన్నారు. వృత్తి కులాల రచనలు లేకుండా తెలుగు సాహిత్యం లేదని విశ్లేషించారు. వృత్తి కులాల నుంచి వచ్చిన రచనలన్నింటిని ముద్రించే భగీరథమైన బాధ్యతను తెలంగాణ సాహిత్య అకాడమీ చేపడుతుందని ప్రకటించారు.
మన గంగా, జమున, తెహజీబ్ సంస్కృతికి రక్షకులుగా వృత్తి కులాల రచయితలే నిలుబడుతారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వృత్తి కలాలన్నీ ఏకం కావాలని, వృత్తి కుల రచయితలు విశాల దృక్పథం కలవారని వివరించారు. వృత్తి కులాల కలాలు లేకుండా తెలుగు సాహిత్యం ఒక్క కూడా ముందుకు వేయలేదని కరాఖండిగా చెప్పారు. సమస్త వృత్తుల కలాలన్నీ ఏకంగా ఉంటేనే ఈ సమాజం సమతుల్యంగా ఉంటుందన్నారు. సమస్త వృత్తి కులాల సబ్బండ వర్ణాల విస్తృత వేదికగా ఉత్పత్తి కులాల సాహిత్యాన్ని రికార్డు చేసి విశ్వ సాహిత్య వేదికపై నిలబెట్టే బృహత్తర పనిని తెలంగాణ సాహిత్య అకాడమీ తన భుజాలపై వేసుకుంటదని జూలూరు స్పష్టం చేశారు.