పాల్వంచ రూరల్, డిసెంబర్ 7: అర్హులైన పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పోడు సర్వే నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలోని లారీ యజమానుల సంఘం హాలులో బుధవారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
అటవీ శాఖ అధికారులు గతంలో గిరిజనుల నుంచి భూమి గుంజుకుని మొక్కలు నాటారని, దీంతో పోడుదారులు హక్కులు కోల్పోయారని పేర్కొన్నారు. ఆ భూములను గుర్తించి తిరిగి పోడు దారులకు అప్పగించాలని కోరారు. ఇండ్ల స్థలాలు ఉన్న వారికి ప్రభుత్వం రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించిందని, వాటిని రూ.5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు బీ వెంకట్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.