Pocharam Forest | హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా పోచారం వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రపంచంలోనే అతిచిన్నదైన అడవిపిల్లి సంచరిస్తున్నదని పరిశోధకులు గుర్తించారు. అభయారణ్యం అంచున ఉన్న 40 గ్రామాల్లో నాలుగు నెలలపాటు శోధించిన తర్వాత మచ్చలపిల్లి (అడవిపిల్లి)ని ఆ పరిశోధకులు కనుగొన్నారు. వారు దాని శాస్త్రీయ ఆధారాలనూ కనుగొన్నారు. 2023 సెప్టెంబర్లో తమ పనిని ప్రారంభించిన పరిశోధకులు 15 కెమెరా ట్రాప్లను గ్రామాల్లో ఏర్పాటుచేశారు. నాలుగు నెలల్లో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వాటిని మార్చారు.
పిల్లి పరిరక్షణ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ (ఏడబ్ల్యూసీఎస్) వన్యప్రాణి అధిపతి అమర్నాథ్ జకా ఆధ్వర్యంలో పిల్లి చిత్రాలతో గ్రామాల్లో తనిఖీలు చేశారు. ఆయా గ్రామస్థుల సహాయంతో చివరికి పిల్లి సంచరిస్తున్నట్టు గుర్తించారు. ఎలుకలను తినడం ద్వారా రైతులకు సహాయపడే చిన్న పిల్లిని రక్షించాల్సిన అవసరం గురించి గ్రామస్థులకు కూడా అవగాహన కల్పిస్తామని అమర్నాథ్ చెప్పారు. ఆయా గ్రామాల్లో రక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తామని, దీనికోసం రాష్ట్ర అటవీశాఖ మద్దతు కోసం తాము ఎదురు చూస్తున్నామని తెలిపారు.