హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పోచంపల్లి ఇక్కత్కు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని తెలంగాణ మేధో సంపత్తి హక్కుల విభాగం (ఐపీఆర్) లీగల్ హెడ్ సుబ్రజిత్ తెలిపారు. ఈ కళకు 2004లోనే భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించడంతోపాటు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ పర్యాటక సంస్థ నిరుడు పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించడంతో పోచంపల్లి ఇక్కత్కు మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. తద్వారా నేత కార్మికుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు.
సుదీర్ఘ వారసత్వం గల పోచంపల్లి ఇక్కత్ను పండుగ బహుమతుల కోసం విరివిగా ఉపయోగిస్తున్నారని, దీంతో ఎగుమతులకు ఎనలేని డిమాండ్ ఏర్పడిందని గుర్తుచేశారు. జీఐ గుర్తింపును, ఉత్తమ పర్యాటక గ్రామ హోదాను ఉపయోగించుకొని పోచంపల్లిని అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. పోచంపల్లి ఇక్కత్ కళ గురించి పర్యాటకులు తెలుసుకునేందుకు వీలుగా మ్యూజియంను ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను అందుబాటులోకి తేవాలని సూచించారు. పర్యాటకులు రెండు మూడు రోజులు అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేయడం ద్వారా జీఐ టూరిజంను ప్రోత్సహించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని సుబ్రజిత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.