హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): గిరిజనుల రిజర్వేషన్ల తీర్మానాన్ని పక్కనపెట్టిన కేంద్రం తీరును నిరసిస్తూ ప్రధాని మోదీకి నల్లజెండాలతో స్వాగతం పలుకాలని ఓయూ గిరిజన, ఆదివాసీ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్న సందర్భంగా అన్ని గిరిజన నివాసప్రాంతాలు, తండాలు, గుడారాలు, చెంచు పెంటలలో నల్లజెండాలు ఎగరవేసి నిరసనలు తెలపాలని గిరిజన చైతన్య వేదిక, గిరిజన శక్తి, లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఆదివాసీ స్టూ డెంట్ ఫోరం, ఆలిండియా బంజారా స్టూడెం ట్స్ ఆర్గనైజేషన్, గిరిజన విద్యార్థి సంఘం నా యకులు మంగళవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద మీడియాతో మాట్లాడారు. గిరిజనులకు గతంలో ఉన్న ఆరు శాతం రిజర్వేషన్ను పెంచాలని సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానికి స్వయంగా కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. దేశంలో 50 శాతానికి రిజర్వేషన్లు మించకూడదని నిలువరించడం తగదని, ఒకవేళ ఏ రాష్ర్టానికైనా ప్రత్యేక పరిస్థితులు తలెత్తినప్పుడు రా ష్ర్టాలు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని పేర్కొన్నట్టు వారు గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన ప్రత్యేక పరిస్థితుల్లో గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని సంఘాల నాయకులు సుబ్బునాయక్, శరత్నాయక్, అశోక్నాయక్ తదితరులు డిమాండ్చేశారు.