హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ రాజ్యాంగ ద్రోహి అని, తెలంగాణ ఏర్పాటుపై మరోసారి విషం చిమ్మాడని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. మోదీ తెలంగాణ పాలిట రాబందులా, మోసకారిగా మారాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ మాటలతో ఏపీ, తెలంగాణను మళ్లి కలిపే కుట్ర జరుగుతున్నదన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణకు అడుగడుగునా వ్యతిరేకమనే విషయాన్ని మోదీ వ్యాఖ్యలు నిజం చేశాయని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన రాష్ర్టాన్ని అపహాస్యం చేసినందుకు మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు. మోదీ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే జీర్ణించుకోలేకపోతున్నారని, విభజన హామీలను అమలు చేయకుండా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.