రామానుజుడి విగ్రహం జాతికి అంకితం
అవనిలోనే అతిపెద్ద పంచలోహ విగ్రహం
విరాట్ రామానుజులకు సర్వలోక నీరాజనం
విశిష్టాద్వైత ప్రవర్తకుల అద్భుత విగ్రహావిష్కరణ
ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ
రామానుజుల బోధనలను కీర్తించిన ప్రధాని
తెలుగు సంస్కృతి గొప్పదని ప్రశంసలు
చినజీయర్స్వామితో కలిసి విష్వక్సేనేష్టి
పూర్ణాహుతిలో పాల్గొన్న నరేంద్ర మోదీ
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 5 : సమసమాజ నిర్మాణాన్ని కాంక్షించి, ఆచరించి, ఉద్బోధించి భారతీయ సమాజంపై చెరగని ముద్రవేసిన సమతామూర్తి భగవద్రామానుజాచార్యుల భారీ విగ్రహం ఆవిష్కృతమైంది. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో త్రిదండి చినజీయర్ స్వామివారి శ్రీరామనగరం ఆశ్రమంలో ఏర్పాటుచేసిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రామానుజుల పంచలోహ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఆవిష్కరించారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకొన్న ప్రధాని, చినజీయర్ స్వామితో కలిసి రామానుజుల సహస్రాబ్ది సమారోహం సందర్భంగా నిర్వహిస్తున్న విష్వక్సేనేష్ఠిలో పాల్గొన్నారు. అనంతరం దివ్యసాకేత క్షేత్రంలో రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ నిర్మించిన 108 వైష్ణవ దివ్యదేశాలను దర్శించారు. ధ్యాన మందిరాన్ని సందర్శించి, అక్కడ ఏర్పాటుచేసిన 120 కిలోల బంగారు రామానుజాచార్యుల విగ్రహాన్ని తిలకించారు. విగ్రహం వద్ద లేజర్ లైటింగ్ను, త్రిడీ మ్యాపింగ్ షోను ప్రారంభించారు.
సమానత్వ సందేశానికి విగ్రహ రూపం
దివ్యసాకేత క్షేత్రంలో ఏర్పాటుచేసిన రామానుజాచార్యుల భవ్యమైన విగ్రహం జ్ఞానం, వైరాగ్యం, ఆదర్శాలకు, సిద్ధాంతాలకు ప్రతీకగా నిలుస్తున్నదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సమానత్వ సందేశాన్ని విశాల విగ్రహ రూపం లో రామానుజులు అందజేస్తున్నారని, దాని నుంచి యావత్ దేశం సమానత్వ స్ఫూర్తిని పొందుతున్నదని తెలిపారు. రామానుజులు దేశ ఐక్యత, సమగ్రతకు ఎంతో కృషి చేశారని ప్రస్తుతించారు. ఆయన స్ఫూర్తిని నలుదిశలా చాటేందుకు సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటుచేసి, లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న యాగ ఫలం ప్రజలందరికీ చెందుతుందని పేర్కొన్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన క్షణమని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం రచనలు, విశిష్టాద్వైత సిద్ధాంతం, భగవత్ గీతపై వ్యాఖ్యానాల ద్వారా రామానుజాచార్యులు చేసిన కృషిని కొనియాడారు. రామానుజాచార్యుల ప్రేరణతో నూతన భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొన్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి స్వాగతం పలికారు.
చరిత్రాత్మక దినం: చినజీయర్ స్వామి
వెయ్యేండ్ల క్రితమే సమతాస్ఫూర్తిని చాటిన మహాభావుడు రామానుజాచార్యులని చినజీయర్ స్వామి తెలిపారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేసిన ఈ రోజు చరిత్రాత్మకమైదని అభివర్ణించారు. రామానుజాచార్యుల బోధనలు ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రేమతో ఇక్కడిదాకా వచ్చి సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
నలుదిశలా నారాయణ మంత్రం
‘నారాయణ మంత్రం.. శ్రీమన్ నారాయణ భజనం’ అంటూ ముచ్చింతల్ ప్రాంగణం భక్తి పారవశ్యంలో ఊగిపోయింది. శ్రీరామానుజుల సహస్రాబ్ది సమారోహ కార్యక్రమం నాలుగో రోజు శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. 30 నిమిషాలపాటు సాగి లేజర్ షో రామానుజుడి విగ్రహం చుట్టూ సప్తవర్ణ కాంతులను విరజిమ్మింది. కళాకారులు తమ నాట్య కౌశల్యాన్ని ప్రదర్శించారు. భక్తులు రామనుజుడిని ఆరాధిస్తున్న విధానం అందరినీ ఆకట్టుకున్నది.
తెలుగు సంస్కృతి గొప్పది
తెలుగు సంస్కృతి ఎంతో గొప్పదని ప్రధాని మోదీ అన్నారు. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు తెలుగుజాతి, భారతదేశ ఔన్నత్యాన్ని చాటారని కొనియాడారు. ఇటీవల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, తెలంగాణ పోచంపల్లి చీరలు భారతీయ సంస్కృతిని, కళలను ప్రపంచానికి చాటాయని అభివర్ణించారు. తెలుగు సినిమా ప్రపంచ ఖ్యాతి పొందిందన్నారు. అద్భుత పర్యాటకానికి తెలంగాణ పెట్టింది పేరు అని గుర్తుచేశారు. తెలుగు నేలపై ఆవిష్కృతమైన సమతామూర్తి విగ్రహం కూడా దేశ సమానత్వ సందేశాన్ని మరోసారి ప్రపంచానికి చాటుతున్నదని పేర్కొన్నారు.
చినజీయర్ అద్భుత కృషికి నమస్కారాలు
సమతామూర్తి ఆవిష్కరణపై మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, ఫిబ్రవరి 5 : రామానుజాచార్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శనివారం స్పందించారు. ‘హైదరాబాద్లో పవిత్ర సాధువు శ్రీ రామానుజాచార్యుల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఆవిష్కరిస్తున్న శుభ సందర్భంగా చినజీయర్ స్వామి అద్భుతమైన కృషికి నా వినయపూర్వక నమస్కారాలు’ అని ట్వీట్చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్టుచేశారు.
శాస్త్రీయ పురోగతుల్లో ఇక్రిశాట్ది కీలకపాత్ర
ఇక్రిశాట్ 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి కే తారకరామారావు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ‘శాస్త్రీయ పురోగతులు, ఆవిష్కరణల్లో ఇక్రిశాట్ కీలక పాత్ర పోషించింది. గ్రామీణ ప్రజలు పోషకాహార లోపాన్ని అధిగమించడంలో, పర్యావరణ క్షీణతను నివారించడంలో ఎంతో కృషి చేసింది. ఇక్రిశాట్ 50 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఇన్స్టిట్యూట్తో అనుబంధం ఉన్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వ్యక్తులందరికీ నా అభినందనలు’ అని ట్వీట్చేశారు.