ముస్తాబాద్, ఫిబ్రవరి 12: ఉద్యమనేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు ఓనమాలు నేర్పిన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రభుత్వ పాఠశాల 75 వసంతాల వేడుకకు ముస్తాబైంది. 1950-51లో ఏర్పాటైన పాఠశాల, ఏడు దశాబ్దాల కాలంలో ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన బాల్యంలో గూడూరులో తన అక్కబావ సకలమ్మ- హన్మంతరావు వద్ద ఉన్నారు.
పక్క గ్రామం పోతుగల్లోని ఈ పాఠశాలలో ఓనమాలు దిద్దారు. కేసీఆర్ రాజకీయ రంగ ప్రవేశం అనంతరం అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్న టైంలో 2004లో ఈ పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. కార్పొరేట్కు దీటుగా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, శంకుస్థాపన చేయగా 2006లో భవనం పూర్తయింది.
ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు డీజీపీ, డీఎఫ్వోలు, అడిషనల్ కలెక్టర్లు, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, సైంటిస్టులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. పాఠశాల ప్రారంభించి శుక్రవారానికి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహణకు పూర్వ విద్యార్థులు ఏర్పాట్లు చేశారు. ఎందరో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన పాఠశాల ప్లాటినం జూబ్లీ వేడుకలను తన హయాంలో నిర్వహించడం సంతోషంగా ఉందని హెచ్ఎం సురభి రాధాకిషన్రావు పేర్కొన్నారు. బడికి చేయూతనిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు.